అనారోగ్యంతో హాస్పటల్ లో చేరిన వధువుకు.. పెద్దలు నిర్ణయించిన శుభ ఘడియల్లోనే వరుడితో తాళి కట్టి పెళ్లి చేసారు. .తెలంగాణ రాష్ట్రం చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి ఇరు కుటుంబాల పెద్దలు గురువారం ఉదయం 8 గంటలకు పెండ్లి నిశ్చయించారు. వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా బుధవారం సాయంత్రమే శైలజ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు మంచిర్యాలలోని సన్ క్రిటికల్ కేర్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు శైలజకు పరీక్షలు నిర్వహించగా, శరీరంలో రక్తం తక్కువగా ఉన్నదని, వెంటనే రక్తం ఎక్కించాలని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. దీంతో ముహూర్తానికే పెండ్లి జరిపేలా దవాఖాన సిబ్బందిని పెద్దలు ఒప్పించారు. ఆ తర్వాత దవాఖాన బెడ్డుపైనే వేద మంత్రాల సాక్షిగా పెండ్లితంతు జరిపించారు. ప్రస్తుతం శైలజ కోలుకుంటున్నదని డాక్టర్లు తెలిపారు.