‘నష్టాలను జాతికి అంకితం చేసి, లాభాలను దోస్తులకు పంచడమే ప్రధాని మోదీ విధానం..;; కేటీఆర్/‘ విశాఖ ఉక్కు పొట్టగొట్టడం వెనుక, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని ఎండబెట్టడం వెనుక బైలదిల్లా గనులకు సంబంధించిన కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ కుట్ర విలువ రూ.6 లక్షల కోట్లు ఆయన ఆరోపించారు. ఇంతటి విలువైన బైలదిల్లా గనులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఇష్టరత్నం అదానీకి కట్టబెట్టారని తెలిపారు. బైలదిల్లా ఐరన్ ఓర్ గనులు ఛత్తీ్సగఢ్లో ఉన్నాయని, ఇది బయ్యారానికి 150 కిలోమీటర్లు ఉండగా, విశాఖ ఉక్కు కర్మాగారానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పేర్కొన్నారు. ఆ గనులను ఈ రెండు ఉక్కు కర్మాగారాల కోసం క్యాప్టివ్ మైన్గా కేటాయిస్తే.. ఇటు తెలంగాణలోని బయ్యారం ఉక్కు కల సాకారం కావడంతోపాటు అటు ఏపీలోని విశాఖ ఉక్కు పటిష్టమయ్యేదని అన్నారు. కానీ, ప్రధాని మోదీ ఆ గనుల్లోని ఇనుప ఖనిజాన్ని దగ్గరలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు కాకుండా 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్లోని ముంద్రాకు తరలించుకుపోయారని వెల్లడించారు. దానిని ఫాస్కో కంపెనీ ద్వారా అదానీకి కట్టబెట్టారని తెలిపారు.
రాజకీయాల కోసం కాదు..
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై తాము మాట్లాడుతున్నది రాజకీయాల కోసం కాదని కేటీఆర్ తెలిపారు. వైజాగ్ పొట్టకొడుతున్నది, బయ్యారం ఎండబెడుతున్నది ప్రధాని, అదానీయేనని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలోని నవరత్నాలను.. మోదీ తన ఇద్దరి ఇష్టరత్నాలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ.. ‘‘విషయ పరిజ్ఞానం లేని బండికి ఏం చెప్పినా అర్థం కాదు.
మేం 2014 నుంచి అడుగుతూనే ఉన్నాం..
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కడపలో కూడా స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారని, తెలంగాణలోని బయ్యారం గురించి మేం 2014 నుంచి అడుగుతూనే ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దీనిపై పలుసార్లు కేంద్రానికి ఉత్తరాలు రాశారని పేర్కొన్నారు. తాను 2018 జూన్లో ప్రధాని మోదీని కలిసి బయ్యారం గురించి మాట్లాడానని, బీజేపీ నేతలు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పానని అన్నారు. బయ్యారంలో దొరికే ఐరన్ ఓర్లో గ్రేడ్ ఉందని, ఫెర్రస్ నాణ్యత 64 శాతం ఉన్నందున సాధ్యం కాదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పానన్నారు.
కేంద్రం చేసిన కుట్ర ఇదీ..
ప్రధానిని కలిసి పలుసార్లు విజ్ఞప్తి చేసిన తాము.. దీని వెనుక జరుగుతున్న కుట్రను అర్థం చేసుకోలేకపోయామని కేటీఆర్ అన్నారు. తాను కలిసి మూడు నెలల్లోనే 2018 సెప్టెంబరులో బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో అదానీ ఒక కంపెనీని ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ, అంతకుముందే.. జపనీస్ స్టీల్ మిల్స్కు, దక్షిణ కొరియాకు చెందిన ఫాస్కో కంపెనీకి బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ సప్లై చేస్తామని 2018 ఏప్రిల్లోనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకే బిడ్డింగ్లో పాల్గొనే అంశంపై అధ్యయనానికి బృందాన్ని పంపామని కేటీఆర్ తెలిపారు. ఆ బృందం నివేదిక ఆధారంగా బిడ్డింగ్లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణ విషయంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వ వైఖరిపై తమకు ఆసక్తి లేదని తెలిపారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కాకుండా.. కేంద్రం ఏం చేస్తుందన్నదే తమకు ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.