కొంతమంది అధికారులు నియంతలు మాదిరి వ్యవహరిస్తున్నారు. అమాయకపు ప్రజలను వేధింపులు గురిచేస్తున్నారు. ఆ మధ్య ఇల్లందులో మున్సీపాలిటి ఆఫీస్ ముందు ఆవు మూత్రం పోసిందని సదరు ఆవు యజమానికి జరిమానా విధించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.దీనికి సంబదించిన వీడియో పలు రోజుల పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా.. ఈ ఘటన మరువక ముందే ములుగు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తన వాహనానికి గేదెలు అడ్డొచ్చాయని పాడి రైతుకు జరిమానా విధించి కలెక్టర్ కృష్ణ ఆదిత్య వివాదంలో చిక్కుకున్నారు.
గంపోని గూడెం గ్రామానికి చెందిన బోయిని యాకయ్య అనే రైతు తన గేదెలను మేపేందుకు గానూ సోమవారం పొలం వద్దకు తోలుకెళ్లాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి గేదెలు అడ్డుగా వచ్చాయి. వాహనం డ్రైవర్ ఎంత సేపు హారన్ కొట్టినా గేదెలు అడ్డుతొలగలేదు.
దీంతో కలెక్టర్ పశువల కాపరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాకయ్య ఫై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను కింద స్థాయి అధికారులు అమలు చేశారు. హరితహారంలో నాటిన మెుక్కలను పశువులు నాశనం చేస్తున్నాయంటూ సదరు రైతు యాకయ్యకుఅధికారులు రూ.7,500 జరిమానా విధించారు.
జరిమానా డబ్బు కట్టకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో యాకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన పశువులు మెుక్కలను తినకున్నా జరిమానా విధించారని వాపోయాడు. అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని, ఇంటి నల్లా కనెక్షన్కు సీల్ వేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట కొందరు పాడి రైతులతో కలిసి ధర్నాకు దిగాడు. దీంతో ఈ విషయం జిల్లాలో హాట్ టాఫిక్గా మారింది.