భారత దేశ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడోస్థానానికి ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు, దవాఖానల్లో ఆధునిక వసతులతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలో మాతృమరణాల రేటు(ఎంఎంఆర్), శిశు మరణాల రేటు(ఐఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు( ఎన్ఎంఆర్), ఐదేండ్లలోపు పిల్లల మరణాల రేటు(యూఎస్ఎంఆర్)లో గణనీయ మార్పు నమోదైంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఆరోగ్య సూచీలో ఈ విషయం స్పష్టమైంది.