‘నీ బోడి సలహాలు మాకక్కర్లేదు..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వ్యూహకర్త పోస్టు నుంచి ప్రశాంత్ కిషోర్ ని కేసీఆర్ పీకేశారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఔనని అనిపిస్తుంది. పీకే టీం సర్వేలు, సేవలు, నివేదికలు అవసరం లేదని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పీకే బృందం సర్వేలు తమకు అవసరం లేదనీ పీకేకు ఖరాఖండీగా చెప్పేయడంతో ఇక టీఆర్ఎస్ తో పీకే బంధం తెగిపోయినట్లేనని రాజకేయ పరిశీలకులు భావిస్తున్నారు.
చివరి కి మునుగోడు ఉప ఎన్నిక కు కూడా ఐప్యాక్ సేవలు అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పడంతో తెలంగాణలో పీకే టీంని పక్కన పెట్టినట్లే. కారణాలేవైనా ఈ పరిణామం పట్ల తెరాస శ్రేణులు, నేతలు, ముఖ్యంగా సిట్టింగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇలా హఠాత్తుగానే తీసుకుంటారు. పీకేను టీఆర్ఎస్ వ్యూహకర్తగా నియమించిన సమయంలో ఆయనకు ప్రగతి భవన్ లోనే బస ఏర్పాటు చేసి, వీఐపీ ట్రీట్ మెంట్ ఇచ్చిన కేసీఆర్.. తన జాతీయ రాజకీయ ప్రవేశానికి అవసరమైన సలహాలూ, సూచనలూ తీసుకున్నారని చెబుతారు.
గతంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్.. సడన్ గా కేసీఆర్ పీకేకు ఎందుకు బైబై చెప్పేశారన్న సందేహం పార్టీ శ్రేణుల్లో కలుగుతోంది. అయినా పీకేను కేసీఆర్ పక్కన పెట్టేయడం పట్ల పార్టీ నేతల్లో ముఖ్యంగా సిట్టింగులలో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇంతకీ పీకేను కేసీఆర్ పక్కన పెట్టేయడానికి ఇటీవల తెలంగాణలో పీకే టీం సర్వేలు టీఆర్ఎస్కు నెగెటివ్ గా ఉండటమే కాకుండా, ఆ సర్వేలు లీక్ అవ్వడం సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడం కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ కోసం రహస్యంగా చేయించిన సర్వేలను పీకే లీక్ చేయడం పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు.