‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అని కొన్నాళ్ల క్రితం స్పష్టం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. తన బలం, బలహీనతలపై సరైన అంచనా వేసుకోకుండా తానే బలమైన శక్తిగా అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది..’
2019 ఎన్నికలలో 6 శాతం ఓట్లకే పరిమితమైన జనసేన రాబోయే ఎన్నికల్లో అద్భుతాలు ఎలా సృష్టించగలుగుతుంది… ఇపుడు పవన్ పాపులారిటీ సడన్ గా పెరిగిపోలేదు కదా.. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం 18 శాతం ఓట్లను సాధించింది. అందులో కనీసం సగం కూడా జనసేనకు దక్కలేదు. రెండు చోట్ల పవన్ కూడా ఓటమి పాలయ్యారు. సినిమా పాపులారిటీ వేరు,, రాజకేయం వేరు.. అని అపుడే జనం తేల్చేసారు. ఈ సూక్ష్మాన్ని పవన్ తో పాటు జనసేన ముఖ్యులు గ్రహించాలి.
ప్రతిపక్షాల మధ్య పొత్తుల అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. పొత్తులకు సంబంధించి తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని జన సేనాని పవన్ కల్యాణ్ ప్రకటించగానే పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. మూడు ప్రత్యామ్నాయాల్లో..
# జనసేన– బీజేపీ కలసి పోటీ చేయడం ఒకటి అని ఆయన నోటి నుంచి వెలువడగానే ‘ఆ ప్రత్యామ్నాయం మాకు ఓకే’ అని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పవన్ కల్యాణ్ తన ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించగానే తమ అధినేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తేనే ఎవరితోనైనా పొత్తు ఉంటుందని కొంతమంది జనసేన నాయకులు ప్రకటించారు. ఒకరిద్దరు నాయకులు మరో అడుగు ముందుకేసి… రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ విషయం తేల్చాల్సిందే అని అల్టిమేటం ఇచ్చారు. అయితే… నడ్డా ఏమీ పట్టించుకోకుండానే ప్రోగ్రాం ముగించుకుని వెళ్లిపోయారు.
తన మనసులో ఉన్న ప్రత్యామ్నాయాలను పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేశారో తెలియదు. ముఖ్యమంత్రి జగన్కు మేలు చేయడంకోసమే బీజేపీ నాయకులు పవన్తో ఈ ప్రకటన చేయించారన్న వాదన కూడా ఉంది. అయితే… రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నదాన్నిబట్టి ఆ పార్టీ కేంద్ర నాయకత్వ వైఖరిలో ఇటీవల కొంత మార్పు వచ్చిందంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండేపక్షంలో తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడానికి బీజేపీ అగ్ర నాయకత్వం సుముఖంగానే ఉందన్న సంకేతాలు ఇస్తున్నారు..
క్లారిటీ ఏదీ?
పవన్ కల్యాణ్ ప్రకటించిన ప్రత్యామ్నాయాలపై తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అవసరాన్ని, పరిస్థితులను బట్టి పొత్తుల గురించి ఆలోచించాలని ఆ పార్టీ భావిస్తోంది. తెలుగుదేశం కార్యకర్తలు మహానాడు సక్సెస్ తర్వాత దూకుడు మీదున్నారు. పొత్తులు లేకపోయినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేడర్ బలంగా నమ్ముతోంది. . వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది ముఖ్యం కాదు. రాష్ట్రం ఏమవుతుంది? అన్నదే ముఖ్యం. ప్రజలు ఈ దిశగా ఆలోచిస్తారని ఆశించడం అత్యాశ. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని నినదిస్తున్న జన సైనికులు వాస్తవాలు గ్రహించాలి. పవన్ కల్యాణ్ను రెచ్చగొట్టడమే అధికార పార్టీ వ్యూహం. దీన్నిబట్టి పొత్తులు కుదిరితే తమ అధికారానికి అంతిమ ఘడియలు సమీపించినట్టు వైసీపీ నాయకులు భయపడుతున్నట్టేగా!
విధానపరమైన అంశాల్లో ఏ పార్టీకైనా స్పష్టత ఉండాలి. రాష్ట్రం మరింత విధ్వంసం కాకుండా కాపాడుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని, గతంలో మాదిరి ఓట్లను చీలనివ్వబోమని తొలుత ప్రకటించింది జనసేన అధినేత మాత్రమే. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పవన్ సిద్ధపడినట్లేనని ఎవరైనా భావిస్తారు. బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నానని కూడా పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో 1 % లోపు ఉండే బీజేపీ బలంతో పోల్చితే జనసేన బలమే ఎక్కువ. అలాంటప్పుడు జనసేన నిర్ణయంకోసం బీజేపీ ఎదురుచూడాలి కానీ, బీజేపీ నిర్ణయం కోసం జనసేన ఎదురుచూడటం ఏమిటి? ఓట్లు చీలకూడదు అంటే ఒకటే ప్రత్యామ్నాయం ఉంటుంది కదా? అలా కాకుండా ఓట్లు చీలకూడదని ప్రకటించి ఇప్పుడు షరతులు పెట్టడం అంటే.. ఏ మేరకు స్పష్టత ఉందో అర్ధం చేసుకోవాలి.
ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావడమా? లేక జగన్ను ఇంటికి పంపడమా? తన ప్రాధాన్యత ఏమిటో పవన్ తెలుసుకుని రాజకీయ వ్యూహాలు రూపొందించుకుంటే ఆయన పరువు నిలబడుతుంది. రాష్ట్రానికీ మేలు జరుగుతుంది.