”మాజీ మంత్రి వైఎస్ వివేకాను టీడీపీ వాళ్ళే చంపించారంటూ.. ఈ నాలుగేళ్లు నుంచీ విమర్శిస్తూ వస్తున్న జగన్ అండ్ కో తాజాగా ప్లేట్ ఫిరాయించి వివేకాను అల్లుడు రాజశేఖర్ రెడ్డే చంపి ఉంటాడంటూ కొత్త పల్లవి అందుకున్నారు. సునీతను టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో విస్తృత ప్రసారానికి తెరతీశారు. వివేకా హత్యకు రూ 40 కోట్ల సుపారీ ఇచ్చిన వారు.. సోషల్ మీడియాకు అంతకంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నారు. ”
గూగుల్ టేకౌట్ పరిజ్ఞానాన్ని ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలలోనే వాడారు. మొదటిసారిగా వివేకా కేసులో సీబీఐ అధికారులు గూగుల్ టేకౌట్ను వాడుకున్నారు. దీనివల్ల హత్యకు ముందు, తర్వాత నిందితుల కదలికలు సీబీఐకి తెలిశాయి. ఈ పరిస్థితిని జగన్ అండ్ కో ఊహించి ఉండరు.
ఆస్తి తగాదాల వల్లనే హత్య జరిగిందని అనుకుంటే వివేకానంద రెడ్డి పేరిట ఉన్న మూడున్నర కోట్ల ఆస్తుల కోసం నలభై కోట్ల సుపారీ ఇస్తారా ఎవరైనా?
వివేకా హత్య జరిగినపుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారు.. దీనికి జగన్ సమాధానం చెప్పాలి కదా…
అవినాశ్కు మద్దతుగా, డాక్టర్ సునీతకు వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియాను రంగంలోకి దించారంటే జగన్రెడ్డిని వెనుక నుంచి ఆడిస్తున్నది ఎవరో ఊహించుకోవచ్చు. అయితే సీబీఐ అధికారులు ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దర్యాప్తు చేయకుండా దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడి ఉంటే జగన్రెడ్డి మొదలెట్టిన ప్రచారాన్ని కొంతమందైనా నమ్మేవాళ్లు. ” గూగుల్ టేకౌట్” అనే పదాన్ని సీబీఐ ఎప్పుడైతే వాడిందో అప్పటి నుంచి జగన్ అండ్ కో కుదిటిలోపడిన ఎలుకలా తయారయింది. ‘ఆ పదమే ఇప్పటివరకు వినలేదు. గూగుల్ టేకౌట్ ఎక్కడి నుంచి వచ్చింది’ అని రాష్ట్ర ప్రబుత్య సలహాదారు, వైసీపీ ముఖ్య కార్యదర్శి అయినా సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారంటేనే వారి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ సునీతా రెడ్డి దంపతులే వివేకాను హత్య చేయించారని సొంతంగా విచారణ జరిపి, తీర్పు కూడా ఇస్తున్న వైసీపీ కానీ, ఆ పార్టీ సోషల్ మీడియా కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. డాక్టర్ సునీత దంపతులే నిందితులని అనుకుంటే హంతకులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నవారు హత్యకు ముందు, తర్వాత భాస్కర్ రెడ్డి నివాసంలో ఎందుకు ఉన్నారు? అన్న ప్రశ్నకు జగన్ అండ్ కో సమాధానంచెప్పాలి కదా ?
వైసీపీ చేస్తున్న ప్రచారమే నిజమైతే డాక్టర్ సునీత భర్త రాజశేఖర రెడ్డితో భాస్కర్రెడ్డి చేతులు కలిపారని భావించాలా? హత్య జరిగిన రోజు అంటే 2019 మార్చి 14వ తేదీ రాత్రి నుంచి భాస్కర్రెడ్డి ఫోన్లు ఎందుకు ఆఫ్ చేశారు? ఎన్నికలకు ముందు కోడి కత్తి కేసులో కూడా ఇలాగే డ్రామాను రక్తి కట్టించిన అనుభవం ఉన్న జగన్ అండ్ కో ఇప్పుడు మళ్లీ అటువంటి ప్రయత్నమే చేస్తోంది. అయితే సీబీఐ అధికారులు శాస్ర్తీయంగా చేపట్టిన దర్యాప్తు వల్ల వారి పప్పులు ఇప్పుడు ఉడక్కపోవచ్చు. వివేకా హత్యతో అవినాశ్ కుటుంబానికి సంబంధం ఉన్నట్టు సీబీఐ వద్ద ఆధారాలు ఉండివుంటే తండ్రీ కొడుకులను సాక్షులుగా ఎందుకు పిలుస్తున్నారు? అన్న సందేహం కలుగుతుంది.
సునీత హైకోర్టు ను ఆశ్రయించి ఉండకపోతే..
డాక్టర్ సునీత హైకోర్టును ఆశ్రయించి ఉండకపోతే ఈ కేసు ఎప్పుడో అటకెక్కేది. తండ్రిని చంపుకొందన్న అపవాదును మోయాల్సిన అవసరం డాక్టర్ సునీతకు ఏర్పడి ఉండేది కాదు. ఈ హత్యలో డాక్టర్ సునీత దంపతుల పాత్ర ఉండి ఉంటే కేసు దర్యాప్తు ఇంతదూరం వచ్చి ఉండేది కూడా కాదు. పోయిన మనిషి ఎలాగూ పోయాడు, ఇప్పటికైనా డాక్టర్ సునీతకు నచ్చజెప్పవలసిందిగా భారతీరెడ్డి తల్లి సుగుణమ్మ జగన్ తల్లి విజయలక్ష్మిని కోరవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే వివేకా హత్యకు బలమైన కారణాలే ఉన్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. తనపై దాఖలైన అవినీతి కేసులలో తనకు శిక్షపడితే తన స్థానంలో భార్య భారతి ముఖ్యమంత్రి అవుతారని జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాలలో తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం విదితమే. వివేకానంద రెడ్డి జీవించి ఉంటే షర్మిలకే మద్దతు ఇచ్చివుండేవారని దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు. ఈ కారణంగానే ముందుగా వివేకా అడ్డు తొలగించుకొని ఆ తర్వాత షర్మిలను బయటకు గెంటారని రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు సైతం అనుమానిస్తున్నారు. భారతికి లైన్ క్లియర్ చేయడానికే ఇదంతా జరిగిందన్న అభిప్రాయం వైఎస్ఆర్ కుటుంబంలో బలంగా ఉంది.