“2024లో కూడా జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ను దేవుడు కూడా బాగుచేయలేడు. వేంకటేశ్వరస్వామి, అల్లా, ఏసుక్రీస్తు ఒక్కటై ముఖ్యమంత్రిగా అవతరించినా ఆంధ్రప్రదేశ్ను మరమ్మతు చేయలేరు. ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన రాజకీయంగా కూడా మిత్రత్వం ఉంటుందని భావించవద్దని ప్రధాని మోదీ విశాఖలో తమ పార్టీ నాయకులకు చెప్పడం వినడానికి బాగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత అవసరమే. అయితే కట్టు తప్పిన రాష్ట్ర ప్రభుత్వాలను ఆ విషయం తెలిసి కూడా ప్రోత్సహిస్తే కేంద్రం కూడా బాధ్యతారహితంగా వ్యవహరించినట్టే అవుతుందని ప్రధాని మోదీ గమనించాలి. అడ్డగోలు అప్పులకు సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అధోగతిపాలు కావడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని జరుగుతున్న ప్రచారానికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంది. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోయినా అడిగేవారు లేరన్న భరోసాతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తే వాటిని జగన్ లేదా నరేంద్ర మోదీ తీర్చరు కదా?”
ఆంధ్రప్రదేశ్ నిజంగానే జగన్ పాలనలో భ్రష్టుపట్టి పోయి ఉంటే ప్రజల భవిష్యత్తు కోసమైనా విభేదాలు, వైషమ్యాలు వీడి అందరూ ఒక్క తాటిపైకి రావడం ఇప్పటి అవసరం. అదీ సాధ్యం కాని పక్షంలో ప్రజలే సంఘటితమై తమకు ఏది మంచిది, ఎవరు అధికారంలోకి వస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో గుర్తించి అందుకు అనుగుణంగా ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ముఖ్యం కాదు. రాష్ర్టాన్ని ఎవరి చేతిలో పెడితే రాష్ట్ర భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందో ప్రజలే నిర్ణయించుకోవాలి. రానున్న ఎన్నికలు చంద్ర బాబుకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా చివరి అవకాశం వంటిదే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని పక్షంలో ఆ తర్వాత ఎంతగా చింతించినా ప్రయోజనం ఉండదు!
ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ ఆదివారం రాధాకృష్ణ గారు రాసిన ‘కొత్తపలుకు’ శీర్షిక వ్యాసంలోనిది.
ఆర్కే గారు విశ్లేషించిన పైవన్నీ వాస్తవాలే అనుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆలోచన ఎలా ఉందో. ఇప్పటికే చాపకింద నీరులా మతమార్పిడులు వేగంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయ్. అలాగే జగన్ అధికారంలోకి వచ్చాక కులాల గొడవలు కూడా గణనీయంగా పెరిగాయ్. శాంతిభద్రతలు క్షీణించినా, ఆర్ధిక వ్యవస్థ పతనమవుతున్న,, రాష్ట్రం అప్పులు పాలవుతున్నా ,, పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం కనిపించడంలేదు. తెలంగాణతో పోలిస్తే ఈ సామాజిక బాధ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఘోరమని చెప్పాలి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఉంటే .. చంద్రబాబు ‘లాస్ట్ ఛాన్స్’ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటారంటారా? ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారు పిలుపు ఇచ్చిన్నట్లు జగన్ నుంచి ఏపీని రక్షించుకోవడానికి రెడీ అవుతున్నారా? ఏమో మరి.. వేచి చూడాలి. ఆంధ్ర ప్రజలలో తమ పిల్లల భవిష్యత్తు కోసం సీరియస్ గా ఆలోచిస్తే ఏమవుతుందో చూడాలి.