”2014, 2019 వరుస పరాజయాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని మోదీ , బీజేపీ చేష్టలతో మళ్ళీ బతికించారు. నాయకత్వ లక్షణాలు అంతగా వంటపట్టని రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో సైతం మోడీ, బీజేపీలను నిలువరించే స్థాయిని సంపాదించలేకపోయారు. కానీ రాహుల్ ని పార్లమెంట్అ లో అనర్హత వేటుతో ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి మళ్ళీ ప్రజా క్షేత్రంలో నిలబడేలా చేశారు”
నాలుగేళ్ళ నాటి సంఘటన
ఎపుడో, నాలుగేళ్ళ క్రితం రాహుల్ ఒక సుదీర్ఘ ఉపన్యాసంలో దొంగల ఇంటిపేరు ‘మోదీ’ అని వుంటుందని చమత్కరించారు. దానిపై ఎవరో వేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ కి రెండేళ్ళ జైలు శిక్ష వేసింది. రెండేళ్ళు శిక్షపడిన వ్యక్తి ప్రజాప్రాతినిధ్యం రద్దు చేయవచ్చని చట్టం చెప్తోంది. శిక్షపడిన రాహుల్ ని వెంటనే జైలుకి పంపలేదు. అపీల్ చేసుకోడానికి కోర్టు నెలరోజులు గడువు ఇచ్చింది. పార్లమెంటు సెక్రటేరియట్ మాత్రం ఆఘమేఘాలమీద రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
సాంకేతికంగా ఈ చర్య తప్పుకాకపోవచ్చు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని నీతివాక్యాలు చెప్పుకోవచ్చు. కానీ దీని వెనుక ఉద్దేశ్యాలు కూడా వాటంతట అవే ప్రజల్లో వ్యాపిస్తాయి.
ఈ చర్యను బట్టి రాహుల్ అంటే బిజెపి భయపడుతోందని అర్ధమైంది. దేశంలో ఉన్న కోట్ల మంది ఇలానే అర్ధం చేసుకుంటారు. ఇలాంటివి జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్ని వందల, వేల ఘటనలు జరిగాయి. మోడీ, ఆయన పార్టీ నేతలు కాంగ్రెస్ ని, ఇతర పార్టీలను ఇంకా ఘాటుగా ఎన్నిసార్లు విమర్శలు చేసారు. ఇవ్వన్నీ ప్రజలు మర్చిపోరు. ఇపుడు ఈ చేష్టల వల్ల మోదీ .. కాంగ్రెస్ ని బలపర్చినట్లే అవుతుంది.
జిల్లా స్థాయిలో, రాష్ట్రస్ధాయిలో, జాతీయస్ధాయిలో న్యాయపోరాటానికి రాహుల్ కి అవకాశం వుంది. ఇందువల్ల ఇంతటితో ఆయన ఎంపి పదవి రద్దయినట్టూ కాదు. తదుపరి ఆరేళ్ళు పోటీ చేసే అవకాశం పోయినట్టూ కాదు.
అయితే తన మీద చేసిన ఆరోపణలకు పార్లమెంటులోనే జవాబు చెబుతానన్న రాహుల్ గాంధీని అసలు పార్లమెంటులోకి అడుగుపెట్టకుండా చేయాలన్న బీజేపీ ఆశ ప్రస్తుతానికి నెరవేరినట్లయింది.
దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు కదలిపోతున్నాయని లండన్లో రాహుల్ చేసిన ప్రసంగంలో అబద్ధమేమీ లేదని కాషాయ పాలకుల నియంతృత్వ పోకడలు చెప్పకనే చెబుతున్నాయి. తమని ప్రశ్నించే వారెవరైనా ఉపేక్షించేది లేదని రాహుల్ని ‘శిక్షించడం’ ద్వారా బిజెపి పరివార్ తెలియజేస్తుంది.
అంబానీ-అదానీ ఉదంతం మీద, మోదీ పార్టీకి ఎన్ ఫోర్స్ మెంటు ఏజెన్సీలు సొంత ఆయుధాలుగా మారిపోవడం మీద, సకల వ్యవస్థల్లోకి ‘ఆర్ఎస్ఎస్’ చొరబాటు పైన ఇతరుల కన్నా ఎక్కువగా రాహుల్ ప్రశ్నిస్తూ వచ్చారు. అదానీ-మోదీల మధ్య బంధానికి కారణమేంటన్న రాహుల్ ప్రశ్నలకు జవాబు చెప్పకపోగా, ప్రశ్నిస్తే సహించేది లేదని రాహుల్ పై ముప్పేట దాడి చేయడం బీజేపీ నిరంకుశ పోకడలకు పరాకాష్ట.
మోదీ కూడా విదేశాల్లో పాతప్రభుత్వాల్ని దుమ్మెత్తి పోశారు. 70 ఏళ్ళలో ఏమీ జరగలేదని అన్నీ తాము చక్కబెట్టుకుంటూ వస్తున్నామని దేశదేశాల్లో చెప్పుకొచ్చారు. మోదీ ఉద్దేశం కాంగ్రెస్ ను నిందించడమే! ఏమైనా విదేశాల్లో భారత్ పరువు తగ్గించినట్టే మాట్లాడారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పెద్దగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళలేదు.
రాహుల్ లండన్ ఉపన్యాసంలో విమర్శఅంతా బిజెపి మీదే. అయితే మోదీ పరివారం ఈ అంశాన్ని పట్టుకుని రాహుల్ విదేశాల్లో మన దేశం పరువు తీసేశారని జనంలోకి విస్తృతంగా తీసుకు వెళ్ళగలిగారు.
”భారత్ జోడో యాత్ర” తరువాత రాహుల్ ప్రతిష్ట పెరిగింది. బిజెపి తప్పుల వల్ల కాంగ్రెస్ మీద ప్రజల ఆదరణ పెరుగుతోంది. దేశంలోని కాంగ్రెస్ శ్రేణులన్నీ రాహుల్కు మద్దతుగా సంఘటితమవుతున్నాయి. ప్రస్తుత సంక్షోభ స్థితిని ఓ సదవకాశంగా మలుచుకుని నరేంద్రమోదీని మరింత దీటుగా ఎదుర్కోగల నాయకునిగా రాహుల్గాంధీ చేతికి బీజేపీ మరో ఆయుధం ఇచ్చినట్లయింది. అదానీకి షెల్ కంపెనీల ద్వారా పెట్టిన రూ 20 వేల కోట్ల పెట్టుబడులపై మోదీ, బీజేపీలు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం సామాన్యులలో సైతం ఇపుడిపుడే నాటుకుంటుంది. ఇలాంటి మరి కొన్ని ఘటనలు ప్రజలలోకి వెళితే వాటిపై మోదీ పార్టీ వాళ్లకి వివరణ ఇచ్చుకునే సమయం లేకుండానే లోక్ సభ ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావచ్చు.