”అధికార వైసీపీ 2019 ఎన్నికలముందు పన్నిన పన్నాగాలకు మరోమారు కసరత్తు మొదలెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎన్నికలలో ఒక సామజిక వర్గంపై సోషల్ మీడియా ద్వారా విషం చిమ్మి రాజకీయంగా అత్యంత లబ్ది పొందిన జగన్.. 2024 ఎన్నికలలోను అదే రీతిలో బెనిఫిట్ పొందాలని పన్నాగం పన్నుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది..”
తెలుగుదేశం–జనసేన పొత్తు కుదిరినా ఓట్ల బదిలీ సాఫీగా జరగకుండా నిరోధించడం కోసం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలను తమకు ప్రచారాస్త్రాలుగా వాడటం మొదలుపెట్టారు. ఈ రెండు చిత్రాలను నిర్మించిందీ ఒకే సంస్థ కావడం విశేషం. ఈ రెండింటిలో ఏది దెబ్బతిన్నా నష్టపోయే నిర్మాత ఒక్కరే. అయినా ఈ సినిమాలను రాజకీయంగా వాడుకునేందుకు… కులం కార్డును ప్రయోగించారు. రాజకీయాలలో పొత్తులు అవసరాన్ని బట్టి ఉంటాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమకు అవసరం అనుకుంటే పొత్తు పెట్టుకుంటారు. అవసరం లేదనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారు. గత ఎన్నికల్లో విడిగానే పోటీ చేశారు కదా. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ఓడించడానికి చేతులు కలపక తప్పదని ఆ ఇరువురు నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దాంతో జగన్ అండ్ కోలో కలవరం మొదలైంది. నిజానికి తెలుగుదేశం–జనసేన పార్టీలు చేతులు కలపక తప్పని పరిస్థితిని కల్పించింది జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే.
2019 లో ఒక కులంపై ఇతర కులాల వారిలో విద్వేషాన్ని నింపి అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా అదే ఫార్ములాను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదలైన సందర్భంగా కమ్మ–కాపుల మధ్య వైరాన్ని రగలించే ప్రయత్నాలను జగన్ అధీనంలో నడుస్తున్న సోషల్ మీడియా విభాగమే చేసిందని చెప్పుకుంటున్నారు. ఫేక్ ఖాతాలతో వేలాది పోస్టింగ్స్ పెట్టారు. చిరంజీవి సినిమాకు వ్యతిరేకంగా కమ్మవాళ్లు, బాలకృష్ణ సినిమాకు వ్యతిరేకంగా కాపులు పోస్టింగ్లు పెట్టినట్టుగా ఆయా కులాలవారిని నమ్మించే ప్రయత్నం చేశారు. గతానికి భిన్నంగా ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ నటించిన సినిమాలు రాజకీయాలకు ముడిసరుకుగా ఎందుకు మారాయంటే అందుకు కారణం లేకపోలేదు. మరో ఏడాది తర్వాత జరిగే సాధారణ ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని వార్తలు రావడంతో జగన్ అండ్ కో తమ వ్యూహాలకు పదును పెట్టడం వరకు ఒకే. అయితే దీనిని కులాల మధ్య వైషమ్యాలు పెట్టె రీతిలో కి వెళ్ళుతున్నారు. 2019లో కమ్మ వాళ్ళను ఇతర కులాలకు దూరం చేయాలనీ ప్రయత్నించారు. 2024 లో కమ్మ, కాపు కులాలను సమాజంలోని మిగతా వర్గాలకు దూరం చేసే ప్రయత్నంఇపుడే మొదలుపెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే సమాజంలో ..ముక్యంగా అమాయక జనం నష్టపోయే ప్రమాదం ఉంది.