” శ్రీరాముడికి మరో ఇరవై నాలుగు గంటల్లో అయోధ్యాధిపతిగా పట్టాభిషేకం కానుంది. అయోధ్య నగరమంతా సంబరాలలో మునిగితేలుతుంది. మరునాటి ఉదయానికల్లా ఆ అయోధ్య దృశ్యం తారుమారైంది. పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు పద్నాలుగేళ్ల వనవాసానికి వెళ్లాలనే ఆజ్ఞ జారీ అయింది. ఈ వార్త విని అయోధ్య వాసులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. కానీ శ్రీరాముడి ముఖంలో ఏమాత్రం విచారం కనిపించలేదు. అలా అని దుఃఖాన్ని అణచి పెట్టుకుని లోలోన కుమిలిపోలేదు ఆ దశరధనందనుడు. ”
జీవితంలో అన్నీ సవ్యంగా జరుగుతునంతసేపు ఉల్లాసంగా కనిపిస్తాం. కష్టం, అవమానం, వైఫల్యం వంటి అవాంతరాలు ఎదురైతే అప్పటి వరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉరకలేసిన మనం ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతాం. మనలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. విషాదం మనల్ని ఆవహిస్తుంది. ఇందుకు కారణమైన వారిపై నిందలు వేస్తాం. ఎదురైన పరిస్థితులనూ తిట్టుకుంటాం. మన విధి రాత ఇంతే.. అంటూ నిట్టూరుస్తాం. ఇలాంటి విషమ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ‘రామాయణం’లోని ఈ ఒక్క సన్నివేశాన్నీ గుర్తు చేసుకుంటే చాలు.
శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కాబోతున్నానని తెలిసినప్పుడు ఎంత ప్రశాంత వదనంతో ఉన్నాడో, వనవాసానికి వెళ్లాలని తెలిసినప్పుడూ అంతే ప్రశాంతతతో ఉన్నాడు. రాముడి ముఖంలో ఎలాంటి ఆవేదనగానీ, ఆక్రోశం కానీ, నిరసగానీ కనిపించదు. మహారాజుగా వచ్చిన అవకాశం కోల్పోవడమే కాదు.. కనీసం రాజ్యంలో ఉండేందుకు కూడా శ్రీరాముడికి అవకాశం లేకపోయింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రాముడి కృంగి పోలేదు. ఎవరి జీవితంలోనైనా అపజయాలు ఎదురైనపుడు, కష్టాలు వచ్చినపుడు ‘రామాయణం’లోని ఈ సన్నివేశం గుర్తుకు తెచ్చుకుంటే., మనకు ఎదురైన కష్టాలు, వైఫల్యాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. వాటిని ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలు అలవడతాయి.