ప్రధానమంత్రి హోదాలో ..నరేంద్ర మోదీ.. అన్ని పక్షాల రాజకీయ నాయకులతో తరచుగా భేటీ అవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అలా చేస్తేనే ప్రతిపక్ష పార్టీలు.. ఆయన విధానాలపై ఉన్న అపార్థాలను తొలగించుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన శుక్రవారం దిల్లీలో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మహిళల శ్రేయస్సు కోసమే మోదీ.. త్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చట్టాలు చేయలేకపోయారని, మోదీ మాత్రం ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని కితాబిచ్చారు.