‘దేశ రాజకీయాలలో మరో జాతీయ పార్టీ అవతరించింది. ఇన్నాళ్లూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై తెరాస ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారింది. రాష్ట్ర మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశాక… మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. ఈ భేటీకి తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు.
ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు దారులన్నీ గులాబీమయం అయ్యాయి. అతిథులు, నేతలు, కార్యకర్తల నడుమ సీఎం కేసీఆర్ కలిసి భారీ కాన్వాయ్తో సమావేశానికి వచ్చారు. దాదాపు రెండు గంటలపాటు జరగనున్న ఈ భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అంతకుముందు దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సిఎం పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, సిఎం వో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రస్థానం
2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను కేసీఆర్ ప్రకటించారు. ఆ రోజు ఆయన పెద్ద సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులతో తన సొంతూరు చింతమడక నుంచి హైదరాబాద్ వచ్చారు. పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్.. నాంపల్లి దర్గా నుంచి తన ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అక్కడి నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో టీఆర్ఎస్ను ప్రకటించారు. ఇదిగో ఇప్పుడు సరిగ్గా 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానం తర్వాత ఆ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.