రాష్ట్రంలో సందడి చేసిన విదేశీ అతిథులు.. స్టార్క్ పక్షులు. అవి తిరిగి సైబీరియాకు పయనమవుతున్నాయి. ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామానికి నిత్య అతిథులు అవి. ప్రతి ఏటా జూన్ లో సైబీరియా నుంచి ఇక్కడికి చేరుకోవడం విశేషం. వేల కిలో మీటర్ల నుంచి ఉత్సాహంగా ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ హనీమూన్ చేసుకుంటాయంటే నమ్మడం కష్టం. కాని అది నిజం.
ఫ్రం.. సైబీరియా…… సుమారు 12 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని తేలుకుంచి, టెక్కలి ప్రాంతంలోని తేలినీలాపురం గ్రామాలకు చేరుకుంటాయి ఈ సైబీరియన్ పక్షులు. ఈ పక్షులను స్టార్క్ పక్షులు లేదా నత్త కొట్టు కొంగలు అని కూడా పిలుస్తారు. పొడవాటి కాళ్లు, పొడవాటి ముక్కు, తెలుపు, నలుపు, గోధుమ రంగులో ఉండడం వాటి విశేషం. వర్షాకాలం రాకకు ముందు. అంటే జూన్ కల్లా ఈ పక్షులు ఈ గ్రామాలకు చేరుకుంటాయి.
తేలుకుంచికి.. ఈ పక్షులు గ్రామానికి చేరుకుని సందడి చేస్తాయి. ఒక రకంగా హనీమూన్ కోసమే వస్తాయి. గ్రామ పరిధిలోని రావి చెట్లు, చింత చెట్లు ఆవాసంగా నివసిస్తాయి. సమీపంలోని సముద్ర ప్రాంతాలకు వెళ్లి చేపలను వేటాడుతూ ఆహారాన్ని సంపాదిస్తాయి. ప్రతి ఏడాది జూన్ జూలై మాసాలలో గ్రామాలకు చేరుకునే ఈ విదేశీ పక్షులు డిసెంబర్ జనవరి నెలల్లో తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లిపోతాయి. ఈ ఆరు నెలల కాలంలో ఇక్కడే తమ సంతానోత్పత్తి కొనసాగిస్తాయి. చెట్లపై గూళ్ళు కట్టుకుని పిల్లల్ని కని, సాకుతూ ఉంటాయి. పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఆహారాన్ని తెచ్చి తమ పిల్లలకు పెడతాయి.
గ్రామ ప్రజలతో సైబీరియా స్నేహం.. మూగజీవాలు ఎప్పుడూ మనుషులకు మంచి నేస్తాలు. వాటి మధ్య అనుబంధం చాలా గాఢంగా ఉంటుంది. అది ఈ సైబీరియా స్నేహితుల విషయంలో మరీ అద్భుతం అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు.. ఆ వలస పక్షులకు మధ్య కొన్ని తరాలుగా అనుబంధం కొనసాగుతోంది. ఈ విదేశీ పక్షుల రాకను గ్రామస్థులు శుభప్రదంగా భావిస్తారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే దశలో ఈ విదేశీ స్నేహితులు వచ్చి వాల్తారు. వాటి కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తూఉంటారు.
రైతులకు నేస్తాలు… పంటను పట్టే పురుగులను ఈ విదేశీ పక్షులు భక్షిస్తాయి. వంట పాడవకుండా కాపాడతాయి. గ్రామస్థులు కూడా ఈ వలస పక్షులు తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అవసరమైన ఆహారాన్ని అందిస్తారు. ఈ వలస పక్షులు వేటగాళ్ల బారిన పడకుండా గ్రామస్థులు కాపాడుతూ ఉంటారు. గతంలో ఓసారి ఒక వేటగాడు పక్షులు వేటాడడానికి ప్రయత్నించగా అతడిని పట్టుకుని గుండు కొట్టి గాడిదపై ఊరేగించారు కూడా. దాంతో పక్షులకు వేటగాళ్లు బెడద తగ్గింది. వాటికి ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడం గ్రామస్థులు తమ బాధ్యతగా భావిస్తారు.
ఎప్పుడు వెళ్తాయి.. సుమారు 12 వేల కిలోమీటర్ల దూరం ఉన్న సైబీరియా నుంచి ఈ స్టార్క్ పక్షులు ప్రతి ఏటా జూన్ లో వస్తాయి. తమ సంతానోత్పత్తి ముగించుకుని తిరిగి జనవరిలో తిరుగు పయనం కడతాయి. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సరిగ్గా అదే గ్రామానికి వచ్చి సంతానోత్పత్తి చేసుకుని వాటి సంతానంతో తిరిగి సైబీరియా వెళ్ళిపోతాయి. తిరిగి వెళ్ళిపోయే వరకు అవి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాయి ఈ విదేశీ వలస పక్షులు. వాటిని సురక్షితంగా ఉంచేందుకు.. ఎవరి వల్లా ఏ హానీ జరగకుండా గ్రామస్థులు ఎంతో సహకరిస్తారు కూడా.
పర్యాటకుల తాకిడి.. ఇచ్చాపురం నియోజకవర్గం లోని తేలుకుంచి, టెక్కలి ప్రాంతంలోని తేలినీలాపురం గ్రామాలకు పర్యాటకుల తాకిడి ఎక్కువే. దానికి కారణం ఈ విదేశీ నేస్తాలు. ఎంతో ముచ్చటగా ఉండే వాటిని చూడడానికి పర్యాటకులు క్యూలు కడతారు. విదేశీ పక్షుల సందడి తిలకించడానికి గ్రామస్థులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. దశాబ్దాలుగా గ్రామస్థులు, విదేశీ పక్షుల వారసుల మధ్య బంధం ఏ మాత్రం కాకతాళీయం కాదు. ప్రకృతి ఏర్పరిచిన అవ్యక్తమైన బంధం అనేది ఆయా గ్రామాల ప్రజల నమ్మకం.
విదేశీ అతిథులుతమ సంతానోత్పత్తి కోసం ఆయా గ్రామాలు చేరి చెట్లపై ప్రత్యేకంగా గూళ్ళు నిర్మించుకుంటాయి. అయితే అవి వచ్చే కాలం వర్సాకాలం. భారీ వర్షాలు, కొన్ని సందర్భాల్లో తుఫానులు కూడా సంభవిస్తుంటాయి. అలాంటి సమయంలో అప్పుడు అప్పుడే జన్మించిన సైబీరియా పక్షుల పిల్లలు మృత్యువాత పడుతుండడం బాధాకరం. వాటిని కాపాడుకోవడానికి పక్షుల తల్లులు ఎంత ప్రయత్నించినా నష్టాన్ని నిలువరించలేవు పాపం. భారీ గాలులకు, వర్షాలకు పక్షుల పిల్లలు చెట్ల పై నుంచి కింద పడి మరణిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటి సంఖ్య వందల్లో ఉంటుంది. కింద పడ్డ పక్షుల పిల్లలు బతికి ఉంటే గ్రామస్థులు వాటిని సంరక్షిస్తారు. మృత్యువాత పడితే ఖననం చేస్తారు. అటవీశాఖ అధికారులు పక్షుల రక్షణ కోసం సంరక్షణ కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం కూడా పక్షులకు రక్షణ కరువవుతోంది. ఈ సైబీరియా స్నేహితులను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం..