విభజిత రాష్ట్రానికి కేంద్రం నుంచి న్యాయంగా అమలు కావాల్సిన హామీలపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందంటూ దాదాపు ఐదేళ్ల క్రితం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వెలుపలికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో అవగాహనతోనూ పోటీ చేసిన ఆ పార్టీకి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ఏపీలో ఏకపక్ష విజయం సాధించిన వైసీపీ అధికార పగ్గాలు చేపట్టాక ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పని చేస్తుండటంతో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేపథ్యంలో కేంద్రంలో బలమైన మరో ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించడం లేదనే చెప్పాలి. దీంతో తిరిగి కేంద్రంలోని బీజేపీతో టీడీపీ అధిష్ఠానం సఖ్యత నెలకొల్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదే జరిగితే తనకు ఇబ్బందులేనని ముందునుంచీ భావిస్తున్న వైసీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు నెరుపుతూ టీడీపీ- బీజేపీ కలయిక సాధ్యం కాకుండా శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.
మారిన బీజేపీ వ్యూహం.. టీడీపీకి కలిసివస్తున్న కాలం
అయితే వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోందని భావించిన బీజేపీ సడెన్గా వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది. 2024లో వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా జాగ్రత్తగా పావులు కదుపుతోన్న కాషాయం పార్టీ మరోసారి టీడీపీతో సయోధ్యకు సిద్ధపడుతున్నట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. బీజేపీ రాజకీయం టీడీపీకి కలిసివస్తున్నట్టే కనిపిస్తోంది. బీజేపీకి నమ్మకమైన మిత్ర పక్షాలు ఒక్కొక్కటిగా దూరం కావడం, ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ ఎన్డీయే కూటమిని వీడటం తదితర పరిణామాలతో బీజేపీకి టీడీపీ అవసరం కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో తెలంగాణలో టీడీపీతో పొత్తును వ్యతిరేకించిన ఆ రాష్ట్ర బీజేపీ నేతలే ఇప్పుడు బీజేపీ అక్కడ బలపడిన నేపథ్యంలో టీడీపీతో పొత్తుంటే మరింత బలం పుంజుకోవచ్చని భావిస్తున్నారు. ఇది కూడా టీడీపీకి కలిసివచ్చిన పరిణామమేనని చెప్పాలి.
బీజేపీ- టీడీపీ కలయికపై జాతీయ మీడియాలో కథనాలు
బీజేపీ అనుకూల మీడియాగా పేరున్న రిపబ్లిక్ టీవీలో టీడీపీ మళ్లీ ఎన్డీయేలో చేరే అవకాశాలున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల కలుసుకోవడం ఇందులో భాగమేనని రిపబ్లిక్ టీవీ కథనం తెలిపింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పలు కోణాల్లో ప్రభావం చూపనుందని కూడా ఆ కథనం పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని నిలువరించి విజయం సాధించేందుకు కేంద్రం అండదండలు అవసరమని టీడీపీ భావిస్తోంది. దీంతోపాటు ఏపీలో బీజేపీకి ఉన్న బలం తక్కువే అయినా చెప్పుకోతగ్గ ఓటు బ్యాంకు ఉన్న జనసేన కూడా ఈ రెండు పార్టీలతో కలిసే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో పొత్తు ఈ మూడు పార్టీలకూ లాభదాయకమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే విభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన ఏపీకి బీజేపీ న్యాయం చేయలేదన్న భావన ఏపీ ప్రజల్లో ఉందని, ఆ వ్యతిరేకతను తగ్గించేందుకు రాష్ట్రాన్ని ఆదుకునేలా కేంద్రం కొన్ని వరాలు ప్రకటిస్తే మేలని టీడీపీ క్షేత్రస్థాయి నాయకులు చెపుతున్నారు.