స్వాతంత్య్ర సమరయోధుడు వీరసావర్కర్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయననే డిఫెన్స్లో పడవేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆదానీ కంపెనీల్లో అవకతవకలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపిస్తూ ఇరుకున పెడుతున్న రాహుల్పై బీజేపీ నేతలు ప్రతిదాడి వ్యూహాన్ని ఎంచుకున్నారు. రాహుల్ విదేశాల్లో బాధ్యత మరచి భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడారంటూ బీజేపీ ఇప్పటికే విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కాగా మోదీ అనే ఇంటిపేరున్నవారిని అవమానించేలా గతంలో రాహుల్ గాంధీ మాట్లాడారంటూ ఒకప్రైవేటు వ్యక్తి వేసిన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు శిక్ష వేయడం, వెనువెంటనే పార్లమెంట్ సెక్రటేరియట్ ఆయన లోక్సభ సభ్యత్వంపై వేటువేయడం శరవేగంగా జరిగిపోయాయి. అంతేకాదు.. దేశరాజధాని ఢిల్లీలోని 12-తుగ్లక్ లేన్లో ఎంపీ హోదాలో ఆయనకు కేటాయించిన భవనాన్ని ఖాళీ చేయాలని కూడా లోక్సభ సచివాలయం ఆయనకు తాఖీదులు పంపింది. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా రాహుల్గాంధీపై దేశవ్యాప్తంగా సానుభూతి పెరిగింది.
సావర్కర్పై విమర్శలపై మిత్రపక్షాల ఆగ్రహం
తన ఎంపీ పదవిపై వేటు విషయంపై రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడుతూ విమర్శలకు కట్టుబడే ఉన్నానని క్షమాపణలు చెప్పేందుకు తాను సావర్కర్ను కాదని గాంధీని అని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలపైనే రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ నాయకులు రాహుల్గాంధీ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆయనపై ఎదురుదాడికి దిగారు. మహారాష్ట్రకు చెందిన వీరసావర్కర్ స్వాతంత్య్ర సమరయోధుడు. బ్రిటిష్ పాలనపై పోరాటం చేసి జైలు శిక్షను అనుభవించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలుగా ఉన్న తమకు కూడా నష్టం కలిగిస్తాయని మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతోపాటు ఎన్సీపీ అధినేత శరద్పవార్ కూడా భయపడుతున్నారు. ఇప్పటికే వారు రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించి నష్టనివారణ చర్యలు చేపట్టారు.
ఆధారాలు చూపాలంటూ రంజిత్ సావర్కర్ మండిపాటు
సావర్కర్ బ్రిటిష్ పాలకులకు క్షమాపణ చెప్పి శిక్షనుంచి బయటపడినట్టుగా అర్థం వచ్చేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ఆధారాలుంటే చూపాలని ఆయన రాహుల్కు సవాల్ విసిరారు. స్వాతంత్య్ర సమరయోధుడిని కించపరచినందుకు రాహుల్గాంధీపై చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మొత్తానికి పదవి పోగొట్టుకోవడంతో రాహుల్ గాంధీకి ప్రజల్లో వచ్చిన మైలేజీని సాధ్యమైనంత తగ్గించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, రాహుల్ అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అందివచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.