దేశ రాజకీయాల్లో యూపీ తరువాత అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో మరోసారి సంచలన పరిణామాలు జరగబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. రాష్ట్ర మంత్రిగా ఉన్న శివసేన అసంతృప్త నేత ఏక్నాథ్ షిండే తనకు మద్దతుదారులైన మరో 21 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పొరుగు రాష్ట్రమైన గుజరాత్లోని సూరత్ నగరానికి మకాం మార్చి అక్కడి మెరీడియన్ హోటల్లో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రానట్టు వార్తలు వస్తున్నాయి. వీరిలో ఐదుగురు మంత్రులు కూడా ఉండటంతో .. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏక్నాథ్ షిండే సాధారణ నాయకుడేమీ కాదు.. పార్టీ విస్తరణలో కీలక భూమిక పోషించిన చరిత్ర ఆయనకుంది. ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే ప్రస్తుతం కల్యాన్ స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా పరిణామాలు మహారాష్ట్ర ప్రభుత్వంలో కలవరం కలిగిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలున్నరాష్ట్రంలో బీజేపీ105 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించగా శివసేన 56 స్థానాలను గెలుచుకుంది. శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 54 మంది ఎమ్మెల్యేలతోను, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలతోనూ ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. వాస్తవానికి అలయెన్స్గా పోటీ చేసినా.. ముఖ్యమంత్రి పీఠం కోసం మిత్ర పక్షాలైన బీజేపీ- శివసేనల మధ్య విభేదాలు తలెత్తడంతో ఎవరూ ఊహించని విధంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించిన కాకలు తీరిన సీనియర్ నాయకుడు శరద్ పవార్ మహారాష్ట్రలో బీజేపీ ప్రభంజనాన్ని నిలువరించేందుకు అన్నీ తానై సిద్ధాంతపరమైన వైరుధ్యాలున్న ఈ పార్టీలను ఏకం చేయగలిగారు. శివసేనకు తమతో కలవడం మినహా గత్యంతరం లేదని భావించిన బీజేపీని ఈ పరిణామం అప్పట్లో బిత్తరపోయేలా చేసింది.
కేంద్రంలో తిరుగులేని అధికారం తమ సొంతం కావడంతో నాటి పరిణామాలు ఏమాత్రం రుచించని బీజేపీ అధిష్ఠానం మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అప్పటినుంచే వ్యూహరచన సాగిస్తూ వచ్చింది. అయితే బీజేపీ వ్యూహాలను మహాకూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా దీటుగానే ఎదుర్కొంటూ వచ్చింది. కానీ తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ పోటీ చేసిన ఐదు స్థానాలనూ కైవసం చేసుకుంది. నిజానికి బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నప్పటికీ 133 ఓట్లు సాధించగలగడంతో అదనంగా మరో అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. మహా కూటమి 5 స్థానాలను గెలుచుకున్నా ఆరో అభ్యర్థిని గెలిపించుకోవడంలో విఫలమైంది. స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు కొందరు శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినందువల్లనే బీజేపీ అభ్యర్థి గెలిచారనే అనుమానాలు తలెత్తాయి. దీంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే ఏక్నాథ్ షిండే మద్దతుదారులైన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ప్రస్తుత పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని వారితో చర్చిస్తున్నామని చెపుతున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇది శివసేన అంతర్గత వ్యవహారమని దీనిని ఉద్దవ్ ఠాక్రే పరిష్కరించుకోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రతినిధి మహేష్ మాట్లాడుతూ మహాకూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఖచ్చితంగా భద్రంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తుంటే అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని, ఠాక్రే ప్రభుత్వం ప్రమాదం అంచున ఉందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా కనీస మెజారిటీకి 145 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. మహా వికాస్ అఘాడీ కూటమికి ఇప్పటిదాకా 152 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 22 మంది రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వం మైనారిటీగా మారడం ఖాయం. ఒకవేళ షిండే నాయకత్వంలోని ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తే ప్రభుత్వ ఏర్పాటుకు 133 మంది మద్దతు సరిపోతుంది. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలుండగా ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ గండాన్ని ఉద్దవ్ ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుందో అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో నెలకొంది.