కెరీర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు. మెగాస్టార్ చిరంజీవితో ఈ క్రేజీ డైరక్టర్ తెరకెక్కించిన ‘ఆచార్య’ చిత్రంపై అద్భుతమైన అంచనాలున్నాయి. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొరటాల శివ బుధవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఆచార్య’ చిత్రం చాలా మంచి కథతో రూపు దిద్దుకుందని, అందరినీ అలరించే చిత్రమవుతుందని తెలిపారు. ఇక తన తరువాత ప్రాజెక్టుల గురించి కూడా ఈ దర్శకుడు ఈ సమావేశంలో ప్రస్తావిస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం తాను ఓ అద్బుతమైన కథను సిద్ధం చేసుకున్నానని చెప్పడం ఆసక్తిని కలిగించే విషయం. అంటే పవన్ కల్యాణ్ ఓకే చేస్తే చాలు.. ఈ క్రేజీ కాంబో ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి అని చెప్పవచ్చన్నమాట.
ఇప్పటిదాకా శివ దర్శకత్వం వహించిన ‘మిర్చి’ , ‘శ్రీమంతుడు’ , ‘జనతా గ్యారేజ్’ , ‘భరత్ అనే నేను’ ఒకదానిని మించి మరొకటి విజయం సాధించిన నేపథ్యంలో ఈ దర్శకుడి తరువాత ప్రాజెక్టుపై అందరికీ ఆసక్తి ఉండటం సహజం. అయితే తన తరువాత మూవీ తారక్ హీరోగా తెరకెక్కనుందని గతంలోనే ప్రకటించిన కొరటాల శివ, ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నట్టుగా అది రాజకీయాలకు సంబంధించిన కథాంశంతో కూడిన సినిమా కాదని తెలిపారు. ఎవరూ ఊహించని ఓ విభిన్నమైన కథాంశంతో ఈ మూవీ రూపొందనుందని ప్రకటించారు. ఇక ఆ తరువాత ప్రభాస్తో కూడా ఓ ప్రాజెక్టు ఉంటుందని చెప్పారు. ఇక చెర్రీతో మరో సినిమా ఎప్పుడైనా ఉండొచ్చని కూడా శివ ప్రకటించారు. బహుశా పవన్, చెర్రీ కలిసి నటించే సినిమా కూడా ఇదే కావచ్చన్న ఊహాగానాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.