దాయాది దేశం పాకిస్తాన్కు చెందిన ఓ యుద్ధనౌక గత నెలలో గుజరాత్ తీరంలో భారత పరిధిలోని సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో పాకిస్తాన్కు చెందిన పీఎన్ఎస్ ఆలంగీర్ అనే నౌక ఇలా చొరబడినట్టు అధికారవర్గాలద్వారా తెలుస్తోంది. అయితే ఇండియన్ కోస్ట్గార్డ్కు చెందిన నిఘా విమానం దీన్నిగుర్తించి కమాండ్ సెంటర్కు తెలియజేయడంతోపాటు, నౌక సిబ్బందికి హెచ్చరికలు పంపడంతో అది వెనక్కు వెళ్లిపోయింది. గుజరాత్ సముద్ర తీరం ద్వారా కొంతకాలంగా భారీ స్థాయిలో మాదక ద్రవ్యాల రవాణా సాగుతుండటంతో ఇది పాక్ ఆధ్వర్యంలో సాగుతున్న నార్కో టెర్రరిజంగా భారత్ భావిస్తోంది. అందుకే అక్కడ పటిష్టమైన నిఘా వ్యవస్థను నెలకొల్పింది.
భారత్ తీర రక్షక దళాలకు తెలియకుండా ఎంతవరకు చొరబడవచ్చో తెలుసుకునేందుకే శత్రుదేశం నౌక ఈ ప్రయత్నం చేసినట్టు భారత రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే చైనా హిందూ మహా సముద్రంలో నౌకా స్థావరాలు ఏర్పాటు చేసుకుని భారత్కు పక్కలో బల్లెంగా మారేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క పశ్చిమాన అరేబియా తీరంలో కూడా పాకిస్తాన్ ద్వారా భారత్ను ఇరుకునపెట్టేందుకు కుట్రలు పన్నుతోంది. ఏకకాలంలో రెండు దేశాలనుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధమవుతోంది.