మహారాష్ట్రలో కొద్ది రోజులుగా ఉత్కంఠభరిత పరిణామాల మధ్య కొనసాగుతూ వచ్చిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఊహించని మలుపుల మధ్య శివసేన తిరుగుబాటు వర్గం నాయకుడు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయింది.
నిజానికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన నేపథ్యంలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అందరూ భావించారు. ఎందుకంటే 105 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్షిండే వర్గంలో 30 మందికి పైగా ఎమ్మెల్యేలుండటంతో వారు బీజేపీకి అండగా నిలుస్తారని, వారితో పాటు మరికొందరు స్వతంత్ర సభ్యులతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవిని తాను కోరుకోవడం లేదని, అలాగే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండబోమని ఫడ్నవిస్ ప్రకటించారు. చివరకు బీజేపీ అధిష్ఠానం ఆయనతో చర్చించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. అయితే సీఎం అవుతారనుకున్న ఫడ్నవిస్ డిప్యూటీ సీఎం కావడం, ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందనుకున్న షిండేను సీఎం పదవి వరించడం రాజకీయ వైచిత్రిగా చెప్పుకోవాలి.
బీజేపీ వ్యూహంలో భాగంగానే..
శివసేనలో సంక్షోభం తలెత్తడానికి వెనకుండి బీజేపీ ఆడించిన నాటకమే కారణమని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. శివసేన తిరుగుబాటు వర్గం తిరిగి వెనక్కు వస్తే ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి ఇస్తామని ప్రకటించాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఠాక్రేకు సూచించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేవలం శివసేన పార్టీలోని అంతర్గత సంక్షోభం కారణంగానే మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిందన్న సంకేతం ప్రజల్లోకి పంపించేందుకు బీజేపీ సీఎం పదవిని షిండేకు వదిలేసినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా పూర్తిగా బీజేపీ మద్దతుపైనే పూర్తిగా ఆధారపడే ప్రభుత్వం కాబట్టి అధికారం అంతా ఆ పార్టీ చేతుల్లోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.