అది అనైతిక, అప్రజాస్వామిక సర్కారని మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని ఆ ప్రభుత్వం మరో ఆరు నెలల్లో కుప్పకూలడం ఖాయమని దీదీ అన్నారు. ‘ఇండియా టుడే కాన్క్లేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమంలో పాల్గొన్న మమత ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగుతుందని భావించడం లేదన్నారు. వారు ఏర్పాటు చేసింది ప్రభుత్వాన్ని మాత్రమే.. కానీ ప్రజల హృదయాలను మాత్రం గెలవలేరన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చని, కానీ అదే ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ప్రజలు కిందికి దింపుతారని హెచ్చరించారు.
వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపైనా మమత స్పందించారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో ఉండడం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు అతడిని రెండుసార్లు ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశ బాధ్యతలను యువత చేపట్టాలని మీకు లేదా? అని నిలదీశారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్న బీజేపీ అమిత్ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి ఎలా దక్కిందని ప్రశ్నించారు. దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని మమతా చెప్పారు.