ఇది ప్రపంచంలోనే పెద్ద వింత కావచ్చు. సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తాం. భూ కబ్జా కేసులో ఏకంగా పరమశివుడినే నిందితుడిగా పేర్కొన్నారు. సమన్లు జారీ చేసింది కోర్టు. అంతే కాదు కోర్టుకు హాజరు కాకపోతే కఠిన శిక్ష తప్పదని నోటీసులు కూడా అందజేశారు. శివుడు కోర్టుకు హాజరవ్వాల్సిన ఆ సమయం ఆసన్నమయింది. దీంతో భూతనాథుడు కోర్టు బోను ఎక్కాల్సివచ్చింది.
చత్తీస్గఢ్లోని ఒక భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజంగా నిజం… పరమశివుడితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 9 మంది కూడా విచారణకు హాజరయ్యారు. అసలేంజరిగిందంటే.. చత్తీస్గఢ్లోని రాయగఢ్లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న శివాలయంతో సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ కేసును దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో తహసీల్దార్ రంగంలోకి దిగి ప్రాథమిక విచారణ ప్రారంభించారు. అనంతరం కోర్టు 10 మందికి నోటీసులిచ్చింది. ఈ నెల 25న జరగనున్న విచారణకు భూకబ్జాపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, భూమిని ఖాళీ చేయించి రూ. 10 వేల జరిమానా విధించాల్సి వస్తుందని పేర్కొంది. దీంతో నోటీసులు అందుకున్న శివుడితోపాటు 9 మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు కొందరు. శివుడిని శిక్షిస్తారా? ఏం జరగబోతోందనేది వేచిచూడాల్సిందే…