ఓ నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళితే భారత్, చైనా జీడీపీలు సమానం. ఇంకాస్త వెనక్కు వెళితే మన దేశమే కాస్త మెరుగైన స్థితిలో ఉండేదని చెప్పాలి. కానీ కమ్యూనిస్టు దేశమైన చైనా మారుతున్న ప్రపంచ పరిణామాలను అంచనా వేయడంలో మాత్రం భారత్కంటే కాస్త ముందే మేలుకుంది. అక్కడి ప్రభుత్వం తమ దేశ ప్రయోజనాలకు అనువుగా, అనుకూలంగా విధాన నిర్ణయాలను మార్చుకుంది. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు, తమ కంపెనీలు విదేశాలతో పోటీ పడేందుకు అనువుగా సరళీకరణ విధానాలను అమలు చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో, పేదరికంతో అప్పటిదాకా సతమతమైన ఆ దేశం ఆ జనాలనే చౌకగా లభించే శ్రామిక శక్తిగా.. గొప్ప వనరుగా మలుచుకుంది. ఒకపక్క కఠినంగా జనాభా నియంత్రణ విధానాలను అమలు చేస్తూనే.. చైనా నాయకత్వం తమ దేశాన్ని ప్రపంచంలోనే పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రం(manufacturing hub) గా మార్చివేసింది.
ప్రభుత్వ రంగంలోనూ మరోపక్క ప్రైవేటు రంగంలోనూ విస్తృతంగా పరిశ్రమలు నెలకొల్పేలా కృషి చేసింది. చౌక ఉత్పత్తులతో ప్రపంచాన్ని ముంచెత్తింది. సెల్ఫోన్లు, కంప్యూటర్ల తయారీలో ప్రపంచంలోనే మేటి సంస్థగా ఉన్న యాపిల్ కంపెనీ అమెరికాకు చెందినదైనా ఆ సంస్థ చైనాలో తమ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పి అక్కడి నుంచి పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామి కంపెనీ టెస్లా సహా పలు ఇతర దేశాల సంస్థలు తమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుని లాభదాయకతను పెంచుకునేందుకు చైనాలో పరిశ్రమలు పెట్టక తప్పని పరిస్థితిని ఆ దేశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే గడచిన రెండు దశాబ్దాల కాలంలో ప్రతి ఏటా రెండంకెల అభివృద్ది రేటుతో దూసుకుపోయి ప్రపంచంలోనే ప్రబల ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. ఆర్థికంగా సైనికంగా ప్రపంచాన్ని శాసిస్తూ పలు రంగాల్లో సూపర్ పవర్గా ఉన్న అమెరికానే సవాల్ చేసే స్థాయికి ఎదిగింది.
అయితే ఇదే కాలంలో ఇండియా సాధించిన ప్రగతి కూడా చెప్పుకోదగినదే. కానీ చైనాతో పోల్చి చూస్తే మాత్రం చాలా వెనుకబడే ఉందని చెప్పాలి. చైనాకంటే ఒక దశాబ్దం ఆలస్యంగా భారత్ ఆర్థిక సరళీకరణ విధానాలను అమలులోకి తెచ్చింది. అయితే అభివృద్ధిలో మాత్రం చైనా వేగాన్ని అందుకోలేకపోయింది. ఒకప్పుడు చైనాతో సమానంగా ఉన్న భారత్ జీడీపీ నేడు ఆదేశంతో పోలిస్తే నాలుగోవంతు కూడా లేదు. సైనికపరంగా కూడా చైనా భారత్ కంటే బలంగా ఉంది. చైనాలో అవినీతి నియంత్రణకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ఆ దేశ ప్రగతికి దోహదం చేసింది. కానీ భారత్ పరిస్థితి అందుకు భిన్నం. ఇక్కడ అవినీతి అన్ని రంగాలనూ, అన్ని స్థాయిల్లోనూ వేళ్లూనుకుపోయింది. దేశ ప్రగతికి పెద్ద అడ్డంకిగా మారింది.
ప్రస్తుతం జపాన్ను వెనుకకు నెట్టి ప్రపంచంలో అమెరికా తరువాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా నిలిచింది. భారత్ ఐదో ఆర్థిక శక్తిగా నిలుస్తోంది. ఆసియా ఆర్థిక వ్యవస్థలో సగభాగం ఈ రెండు దేశాలదే. కాగా వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే అమెరికాను సైతం అధిగమించి ప్రపంచంలోనే మేటి ఆర్థిక శక్తిగా చైనా ఘనతను సాధించబోతోందని ఆర్థిక నిపుణులు ముక్తకంఠంతో చెపుతున్నారు. 1998లోనే చైనా జీడీపీ ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగా, మరో తొమ్మిదేళ్ల తరువాత 2007లో భారత్ ఆ మైలురాయిని చేరుకుంది. చైనా తయారీ రంగంలో అద్భుతాలు కొనసాగించగా భారత్ అభివృద్ధిలో సర్వీస్ సెక్టార్ ముఖ్య పాత్ర పోషించింది. కానీ రెండు దేశాల జీడీపీలో భారీ అంతరం ఉంది. 2019 అంచనాల ప్రకారం చైనా జీడీపీ ఇండియా కంటే 4.7 రెట్లు అధికం.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం గత ఏడాది చైనా జీడీపీ 16,642 బిలియన్ డాలర్లుగా ఉంటే భారత్ జీడీపీ 3,049 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే రెండు దేశాల మధ్య భారీ అంతరమే ఉంది. ఉభయ దేశాల మధ్య వాణిజ్యంలోనూ భారత్కు భారీ లోటును ఎదుర్కొటోంది. ఇందుకు ఆ దేశం నుంచి మనదేశానికి భారీగా దిగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే ప్రధాన పాత్ర. భవిష్యత్తులోనూ ఇది కొనసాగవచ్చన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. అయితే చైనా అభివృద్ధి రేటు కొంతకాలంగా తగ్గుతూ వస్తుండగా ఇండియా గ్రోత్ రేటు పెరుగుతుండటం మాత్రం ఆశాజనకమైన విషయం. జనసంఖ్యలో చైనాను త్వరలోనే అధిగమించనున్న ఇండియా అభివృద్ధిలో ఆ దేశానికి దీటుగా ఎప్పటికి ఎదగగలుగుతుందన్నదే దేశంలో అత్యధికుల ప్రశ్న.