హిందువులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన వారాణసీలో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని ఓ బావిలో శివలింగం బయటపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తూ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అత్యంత సున్నితమైన ఈ అంశంపై రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడటంతో ఇది సుప్రీం కోర్టుకు చేరింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ శివలింగం కనిపించిన ప్రాంతాన్ని సంరక్షించాలని, అదే సమయంలో ముస్లింలను మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని జిల్లా మేజిస్ట్రేట్కు ఆదేశాలు జారీ చేసింది.
వివాదం నేపథ్యమిదీ..
కాశీవిశ్వేశ్వరుడి ఆలయానికి ఆనుకుని ఉండే జ్ఞాన్వాపి మసీదు వెలుపలి వైపు గోడపై ఉన్న హిందూ దేవతా మూర్తులకు పూజలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ అనే సంస్థకు చెందిన ఐదుగురు ఢిల్లీ మహిళలు 2021లో కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రదేశం మొత్తాన్ని వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో ఈ నెల 14 నుంచి 16 వరకు అధికారులతో కూడిన కమిషన్ సర్వే నిర్వహించింది. అయితే పూర్తి నివేదిక సిద్ధం చేసి ఇచ్చేందుకు మరో రెండు రోజులు సమయం కావాలంటూ ఈ కమిషన్ కోర్టును కోరింది. దీంతో కోర్టు ఈ నెల 19 దాకా గడువు ఇచ్చింది.
కాగా సర్వే చేస్తున్న సందర్భంగా మసీదులోని బావిలో దాదాపు 12 అడుగులకు పైగా ఉన్న శివలింగం బయటపడిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సోమవారం ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలంటూ అధికారులను ఆదేశించింది. అయితే ఇది శివలింగం కాదని, అక్కడి ఫౌంటైన్ లాంటి నిర్మాణంలో భాగమని మసీదు కమిటీ చెపుతోంది. ఈ వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మసీదు ప్రాంతంలో శాంతిభద్రతల సమీక్ష బాధ్యతను కలెక్టర్కు అప్పగించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.
శతాబ్దాలుగా అది హిందూ ఆలయమేనని నమ్ముతున్న భక్తులు..
కాశీలో విశ్వనాథుడి ఆలయాన్ని సుమారు 2వేల ఏళ్ల క్రితం విక్రమాదిత్యుడి కాలంలో నిర్మించినట్టు చెపుతారు. అయితే అంతకంటే చాలా ముందే ఇక్కడ ఆలయం ఉందని హిందూ పురాణాలు చెపుతున్నాయి. విదేశీ దండయాత్రల కాలంలో ఈ ఆలయం పలుసార్లు దాడులకు గురైంది. మొదటిసారిగా 1194లో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ ఆ ఆలయాన్ని కూల్చివేసినట్టు చరిత్రకారులు చెబుతారు. తర్వాత 17 ఏళ్లకు 1211లో గుజరాత్కు చెందిన ఒక వ్యాపారి ఆ ఆలయాన్ని పునరుద్ధరించారని, తిరిగి 1447-1458 మధ్య హుస్సేన్ షా షర్కీ హయాంలోను, 1489-1517 మధ్య సికందర్ లోఢీ హయాంలో మరలా దాడులకు గురైందని అంటారు. అయితే లభిస్తున్న చారిత్రక ఆధారాల ప్రకారం మొఘల్ పాదుషా అక్బర్ హయాంలో ఆయన సహకారంతో రాజా మాన్సింగ్ కాశీలో ఆలయాన్ని పునరుద్ధరించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 1585లో రాజా తోడర్ మల్.. అక్బ ర్ సాయంతో ఈ గుడిని నవీకరించాడు.
ఔరంగజేబు కాలంలో గుడి కూల్చి మసీదు నిర్మాణం..
మొఘల్ చక్రవర్తులందరిలోకి కరడుగట్టిన పరమత ద్వేషిగా చరిత్రలో నిలిచిపోయిన ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 1669 ఏప్రిల్ 4న కాశీ విశ్వనాథుడి గుడిని కూల్చివేసి ఆ ఆలయ గోడల మీదుగా మసీదును నిర్మింపజేశాడు. ఔరంగజేబు సేనలు వారణాసిపై దండెత్తి వస్తున్నప్పుడు ఆలయంతోపాటు గర్భగుడిలోని విశ్వేశ్వరుడి జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేస్తారేమోననే ఆందోళనతో నాటి ఆలయ పూజారి ఆ శివలింగాన్ని పెకలించి గుడి ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపిగా పిలువబడే అక్కడ ఉండే బావిలో వేసినట్టు కొందరు.. ఆయన కూడా దూకి ప్రాణత్యాగం చేసినట్టు మరికొందరు చెబుతారు. ఆ తరువాత 1700లో అంబర్ రాజు సవాయ్ జైసింగ్-2 మసీదుకు ముందు 150 గజాల దూరంలో ‘ఆది విశ్వేశ్వరుడి’ ఆలయాన్ని నిర్మించాడు. 1742లో మరాఠా సుబేదార్ మల్హర్ రావు హోల్కర్ కాశీ ఆలయానికి పునర్వైభవం తేవాలని సంకల్పించాడు. కానీ, అప్పటికి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ముస్లిం పాలకుల వల్ల ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తరువాత కాలంలో ఆయన కోడలు అహల్యాబాయ్ హోల్కర్ పట్టువదలకుండా ప్రయత్నించి ప్రస్తుతమున్న ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెపుతోంది.
1991 నుంచి కోర్టులో కేసు
ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వేశ్వరుడి ఆలయాన్ని కూలగొట్టి అక్కడ నిర్మించిన జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో కొత్తగా గుడి కట్టి, పూజ లు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ 1991 అక్టోబరు 15న పండిట్ సోమ్నాథ్ వ్యాస్, డాక్టర్ రామ్రంగ్ శర్మ తదితరులు వారాణసీ స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ, మసీదు తరఫున ‘అంజుమన్ ఇంతెజామియా మస్జిద్’ స్టే కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. 1998 నుంచి ఆ కేసు పెండింగ్లో ఉంది. 2019లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో విజయ్ శంకర్ రస్తోగీ తనను తాను విశ్వేశ్వరుడి స్నేహితుడిగా పేర్కొంటూ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించాల్సిందిగా కొత్త పిటిషన్ వేశారు. 2021 ఏప్రిల్ 8న కోర్టు ఈ మేర కు ఉత్తర్వులిచ్చింది. తాజా పరిణామాలకు ఈ కేసే ప్రాతిపదిక. కాగా మతపరమైన సున్నిత అంశాలతో కూడినది కావడంతో ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఈ వివాదం సామరస్యంగా పరిష్కారం కావాలని దేశంలో అత్యధికులు కోరుకుంటున్నారు.