జ్ఞానవాపి మసీదులో ఉందని చెపుతున్న శివలింగానికి కార్బన్డేటింగ్ పరీక్షలు నిర్వహించి అది ఏకాలంనాటిదో నిర్ణయించేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ వివాదాస్పద అంశంలో అసలు నిజం ఏమిటో త్వరలోనే తేలనుంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వారణాసిలోని విశ్వేశ్వరాలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి.
మసీదులో ప్రార్థనలకు ముందు కాళ్లు చేతులు శుభ్రపరచుకునే వాజూఖానాలో శివలింగం ఉందని, అసలు ఆ మసీదును మెఘల్ సుల్తాన్ల పాలనాకాలంలో ఆలయాన్నికూల్చి నిర్మించారని హిందూ పక్షవాదులు ఉద్యమించారు. అందుకు ఆధారంగా శివలింగం ఆకారంలో ఉన్న నిర్మాణానికి సంబంధించిన చిత్రాలను వెలికితీశారు. అయితే అది శివలింగం కాదని, మసీదులో ఫౌంటైన్ మాదిరిగా నిర్మించిన కట్టడమని మసీదు నిర్వాహకులు తమ వాదనను వినిపించడంతో ఈ వివాదం న్యాయస్థానానికి చేరింది.
ఇక్కడ లభ్యమైన శివలింగం వయసులను నిర్దారించేందుకు కార్బన్డేటింగ్ నిర్వహించాలంటూ హిందూపక్షవాదులు దాఖలు చేసిన పిటిషన్ను గత ఏడాది అక్టోబర్ 14న వారణాసి జిల్లా కోర్టు కొట్టివేసింది. అయితే ఈతీర్పును సవాల్ చేస్తూ హిందుత్వవాదులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని ధర్మాసనం హిందూ పక్ష వాదనలతో ఏకీభవించింది. శివలింగానికి ఎలాంటి డ్యామేజీ జరగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.