కలలను సాకారం చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నాయకుడు ప్రధాని మోదీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు . ‘మోదీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమక్షంలో దిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీపై సరైన విశ్లేషణను పుస్తకంలో సమర్థంగా అందించారని రచయితలపై ప్రశంసలు కురిపించారు. ” ఒక దిగ్గజ నాయకుడి 20 సంవత్సరాల ప్రయాణాన్ని రచయితలు అద్భుతంగా ఆవిష్కరించారు.. ప్రధాని మోదీ ఒక అద్భుతం. మోదీ ప్రయాణం, మాటలు, పనులు, కలలు, వాటి సాకారాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన దేశ ప్రజల కోసం ఎలా పెద్ద కలలు కనగలుగుతున్నారు. కోట్లాది మందిని ప్రభావితం చేసే ఆ కలలను ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం సాయం చేస్తుంది.” అని భారత్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు.
మోదీ నాయకత్వంలో సమ్మిళిత అభివృద్ధి: ప్రధాని మోదీ 20 ఏళ్ల పరిపాలనపై కూలంకషంగా వివరించారు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశాన్ని సమ్మిళిత అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందన్నారు. ‘ ఈ పుస్తకం భగవత్ గీతలా ప్రాచుర్యం పొందుతుంది. మోదీ చిన్న కార్యకర్త నుంచి అత్యంత ఆదరణ పొందిన నేతగా ఎలా ఎదిగారనే విషయాన్ని ఈ పుస్తకం తెలుపుతుంది. క్షేత్రస్థాయిలో ఆటోల్లో, బస్సుల్లో ప్రతి గ్రామానికి తిరిగిన వ్యక్తి మోదీ. పేద వారితో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయనకు కనీసం పంచాయతీని పాలించిన అనుభవం లేదు. కానీ, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించారు.’ అని అమిత్పే షా గుర్తు చేసారు.