‘గగన్ యాన్’ మనకో కీలక ఘట్టం. ఎందుకంటే అది అంతరిక్షంలోకి మానవుడిని పంపించే వాహనం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిన్న ఈ కీలక ప్రయోగం చేసింది. ఆ పరీక్షలో విజయవంతం అయింది. దానికోసం వాడే రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ 3లోని రాకెట్ బూస్టర్ హెచ్ఎస్ 200ను శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో పరీక్షించింది. ఆ ఘన ఇంధన బూస్టర్ ను నిశ్చల స్థితిలో ఉంచి 135 క్షణాల పాటు మండించింది. టెస్ట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇస్రో ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ప్రయోగంలో రాకెట్ లోని మాదటి దశకు సంబంధించిన పరీక్షలో విజయవంతంగా పూర్తిచేశామని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ మిషన్ లో జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ట్రాక్ రికార్డ్ చూశాక.. గగన్ యాన్ కూ అదే రాకెట్ ను వాడేందుకు నిర్ణయించామన్నారు.
మనుషులను అంతరిక్షంలోకి పంపాలి కాబట్టి రాకెట్లో కొన్ని మార్పులను చేశామని తెలిపింది. రాకెట్ నిర్మాణం నుంచి భద్రత వరకూ అన్నింటిలోనూ కీలకమైన మార్పులు చేశామని వెల్లడించింది. అదనపు భద్రతా ప్రమాణాలను జోడించామని, మోటార్ కేస్ జాయింట్లు, అధునాతన ఇన్సులేషన్ (వైరింగ్), ఇగ్నిషన్ వ్యవస్థలను మెరుగుపరిచామని ఇస్రో వివరించింది. అయితే గగన్ యాన్ మిషన్ ను ఈ ఏడాది చివర్లో ప్రయోగించనున్నారు. తొలి ప్రయోగంలో రాకెట్ ను మాత్రమే పంపించి రెండో ప్రయోగంలో మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. ఆ ప్రయోగం వచ్చేఏడాది చేయనున్నారు.