మూడో వేవ్ తర్వాత కోవిడ్ భయాలు తగ్గుముఖం పట్టడంతో ఆ మహమ్మారి మనల్ని వదిలేసిందని సంతోషపడ్డాం. ప్రపంచ వ్యాప్తంగా తాజా పరిస్థితులను గమనిస్తుంటే కరోనా వైరస్ ఇంకా ఎన్నాళ్ళు వెంటాడుతుందో అంతు చిక్కడంలేదు..
కరోనా ఇక మనల్ని వదలదా..? అవును..! వదలదు..! వదలనే వదలదు..! గత వారం రెండు రెట్లు పెరిగిన కరోనా కేసుల లెక్కలు తీస్తే నిజమనిపిస్తుంది. దేశవ్యాప్తంగా నిత్యం 2వేలకు పైగా కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజులుగా రోజుకు వెయ్యికు పైగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.6 శాతం దాటింది. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆర్- వేల్యూ క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులే కరోనా ఫోర్త్ వేవ్కు సంకేతంల భయపెడుతుంది. కేసులు తగ్గుతున్నాయని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో నేనున్నానంటూ.. ఈ మహమ్మారి.. బయటకు వస్తుంది. మరోవైపు CBSE 10, 12వ తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్స్, కాలేజీల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడం.. పరీక్షలు స్టార్ట్ అవుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది. 12రాష్ట్రాల్లో కరోనా గ్రాఫ్ పెరిగింది. ఈ వారంలో దేశవ్యాప్తంగా 15వేల 700 కేసులు నమోదయ్యాయి. అంతకముందు వారంలో ఈ సంఖ్య కేవలం 8వేలుగా ఉంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు కరోనా ఆందోళనలో ఉన్నాయి.
గత వారం కేసుల్లో 75శాతం కేసులు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రతిసారి ఇలా ఉత్తర భారతంలో మొదట వేగంగా వ్యాపించి.. ఆ తర్వాత మహారాష్ట్రతో పాటు దక్షిణ రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణాలలో విజృంభిస్తోంది. గతేడాది సెకండ్వేవ్, ఈ ఏడాది జనవరిలో వచ్చిన థర్డ్వేవ్లోనూ ఇదే జరిగింది. మరోసారీ ఇదే రిపీట్ అయ్యే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ మరోసారి కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. . ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ముఖ్యమంత్రులతో సమావేశమౌతారు. కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా.. కేసుల కట్టడిచర్యలను తీసుకునే దిశగా ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.