ఇప్పటికే ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగడంతో పాటు, సైనికంగానూ అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతున్న చైనా ప్రపంచాధిపత్యం కోసం అర్రులు చాస్తోంది. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక వంటి దేశాల బలహీనతలను ఆసరా చేసుకుని వాటికి రుణ సహాయం చేసి ఆదుకున్నట్టు నటిస్తూ వాటిని తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పలు ఆఫ్రికన్ దేశాల్లో సైతం ఇదేమాదిరిగా పాగా వేసింది. ఇక ఆసియాలో భవిష్యత్తులో తనకు పోటీగా ఎదిగే అవకాశాలున్నాయని భావిస్తున్న భారత్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతోంది.
భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో తమ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని చక్రబంధంలో ఇరికించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. భారత్ అభ్యంతరాలను పెడచెవిన పెడుతూ తన నిఘా నౌక యువాన్ వాంగ్-5ను ఇప్పటికే శ్రీలంకలోని హంబన్టోట రేవుకు చేర్చింది. ఈ ఓడరేవును శ్రీలంకకు గతంలో ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా 99 ఏళ్ల లీజుకు చైనా సంపాదించిన విషయం తెలిసిందే.
పాక్లోనూ సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నం..
ఇప్పటిదాకా భారత్కు వ్యతిరేకంగా పాక్కు సైనిక, ఆర్థిక సాయం చేస్తూ వచ్చిన చైనా ఇప్పుడు ఆదేశంలో మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేసేందుకు చురుగ్గా పావులు కదుపుతోంది. పాకిస్తాన్లో 60 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సీపెక్ (చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్) రక్షణ కోసమని చెపుతూ డ్రాగన్ పాక్లో సైనిక దళాలను పంపేందుకు సిద్ధమవుతోంది. పాక్లో చైనా రాయబారి నోంగ్ రోంగ్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్, విదేశాంగ బిలావల్ భుట్టో, ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బాజ్వాలతో సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. పాకిస్థాన్లో చైనా ప్రాజెక్టులు జరుగుతున్న గ్వాదర్, ఖుజ్దార్, హోషబ్, గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతాల్లో పీఎల్ఏ ఔట్పోస్ట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పనిలో పనిగా గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ సైనిక అవసరాల కోసం వాడుకునేందుకు అనుమతించాలని కూడా డ్రాగన్ పాకిస్థాన్పై ఒత్తిడి తెస్తోంది.
ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుపై పాకిస్తాన్లో వ్యతిరేకత
నిజానికి 2013లో మొదలైన ఈ ఆర్థిక నడవా ఏర్పాటును పాక్లోని సాధారణ ప్రజలతోపాటు, పలు రాజకీయ పార్టీలు, మత సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీని పేరుతో చైనా ప్రాబల్యం పెంచుకుని తమ దేశాన్ని ఓ కాలనీగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందన్న భయం చాలామందిలో ఉంది. ఇక్కడ పని చేస్తున్న చైనీయులపై పలుసార్లు దాడులు జరిగిన ఘటనలున్నాయి. అయితే ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ చైనాను అడ్డుకోగల పరిస్థితిలో లేదు. ఇప్పటికే డ్రాగన్ దేశం పాక్కు 300 బిలియన్ డాలర్లకు పైగా రుణాలిచ్చి ఆ దేశాన్ని గుప్పిట బిగించింది.
మరోపక్క అమెరికా బలాలు నిష్క్రమించిన తరువాత మరోసారి తాలిబన్ల పాలనలోకి జారిపోయిన ఆప్ఘనిస్తాన్లోనూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని, అక్కడ భారత్ ప్రభావాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని కూడా చైనా ప్రయత్నాలు చేస్తోంది. తన చుట్టూ ఉచ్చు బిగించాలని చూస్తున్న చైనా కుహకాలను అడ్డుకోవాల్సిన అనివార్యత భారత్ కు ఎదురవుతోంది.