వినడానికి ఇది విడ్డూరంగానే ఉంది.. కాని నిజమేనని చెప్తోంది చైనాలో ఖరీదైన ఐస్ క్రీమ్ బ్రాండ్. తన ‘చైస్ క్రీమ్’ లు అధిక ఉష్ణోగ్రతల్లోనూ కరిగిపోవంటూ ఓ సంచలన ప్రకటన చేసింది. జాంగ్ షుగావో అనే కంపెనీ ఈ చైస్ క్రీంను తయారు చేస్తోంది. దాని ఖరీదు మన కరెన్సీలో రూ.236 నుంచి రూ.827 మధ్య ఉంది. తన ఉత్పత్తులు మంట పెట్టినా కరిగిపోవని ఆ సంస్థ ప్రకటించింది. అదెలా సాధ్యం? అనుకున్నారా? ఓ వినియోగదారికి కూడా ఇలాగే అనుమానం కలిగింది. దీంతో చైస్ క్రీమ్ బార్ ఒకదానికి లైటర్ తో నిప్పు పెట్టి చూశాడు. అది కరిగిపోవడానికి బదులు కాలుతుండడం కనిపించింది. అది చూసివారు అందులో ఏముందిరా బాబూ..? అని నోరెళ్లబెడుతున్నారు.
కానీ ఐస్ క్రీమ్ కరిగిపోలేదు. 31 డిగ్రీల సెల్సియస్ లో అరగంట పాటు ఐస్ క్రీమ్ కరిగిపోకుండా ఉందని మరో వినియోగదారు ప్రకటించాడు. ఐస్ క్రీమ్ కు ఫైర్ టెస్ట్ చేస్తున్న వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వారు, ఐస్ క్రీమ్ నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఐస్ క్రీమ్ ను తయారు చేసిన సంస్థ స్పందిస్తూ.. జాతీయ అథారిటీ ఏర్పాటు చేసిన నాణ్యత ప్రమాణాల మేరకే తాము తయారు చేసినట్టు ప్రకటించింది. ‘‘బైసాల్ట్ కోకోనట్ ఫ్లావర్డ్ ఐస్ క్రీమ్ లో.. పాలు, సింగిల్ క్రీమ్, కొబ్బరి తురుము, కండెన్స్ డ్ మిల్క్, పాలపొడి ఉన్నాయి’’ అని కంపెనీ తెలిపింది. మంటకే కరగనప్పుడు.. తిన్న తర్వాత కడుపు ఎలా అరాయించుకోగలదు? అన్న సందేహం వ్యక్తమవుతోంది.