బీజేపీ, కాంగ్రెస్ లకు జాతీయ స్థాయిలో సిసలైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తమ టీఆర్ఎస్ పార్టీని భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మార్చిన విషయం తెలిసిందే. ఈపార్టీ ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈనేపథ్యంలోనే పార్టీ తరపున మహారాష్ట్రలో కొన్ని సభలు కూడా నిర్వహించారు. రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తమ బీఆర్ ఎస్ పార్టీ పని చేస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ చెపుతూ వస్తున్నారు. కాగా బీఆర్ఎస్ సభలు మహారాష్ట్ర రైతు సంఘం నేతలను కూడా ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది. శరద్జోషి వంటి రైతు ఉద్యమనేతల ప్రభావంతో ఆ రాష్ట్రంలో రైతులు రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయి చైతన్యవంతులుగా ఉన్నారు. వారు కేసీఆర్ను కలిసేందుకు సమయం ఇవ్వమని కోరడం ఆసక్తికర పరిణామం.
కేసీఆర్ను కలిసేందుకు సిద్ధమవుతున్న రైతు సంఘాల నేతలు
ప్రముఖ రైతు సంఘం షెట్కారీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ సుధాకర్రావు బిందు నేతృత్వంలో 52మంది రైతు నేతలు బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమంటూ కేసీఆర్కు బుధవారం లేఖ రాశారు. ఆయనను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు అంతకుముందు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేవి. ఈ ప్రాంతాల్లోని తెలంగాణ సరిహద్దులోని కొన్ని గ్రామాల ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుతున్నట్టుగా రైతు సంఘం నేతలు తెలిపారు, ఇందుకు కారణమేంటని తాము క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందుతున్న రైతుబంధు వంటి సంక్షేమ పథకాలేనని తెలుసుకున్నట్టు వారు చెపుతున్నారు. రైతు సంక్షేమం, హక్కుల రక్షణకోసం విశేషంగా కృషి చేసిన శరద్జోషి నిష్క్రమణం తరువాత ఎవరితో కలిసి పనిచేయాలో తెలియని సందిగ్దావస్థలో ఉన్న తమకు కేసీఆర్ అందుకు తగిననాయకుడిగా భావిస్తున్నామని వారు లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో మహారాష్ట్ర నేతల చేరికలు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ నిర్వహించిన సభల తర్వాత చెప్పుకోదగిన సంఖ్యలోనే స్థానిక నేతలు ఆ పార్టీలో చేరుతున్నారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో మంచి పేరున్న రాజకీయ కుటుంబానికి చెందిన అభయ్ కైలాస్రావు పాటిల్ బుధవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లా ఎన్సీపీ యూత్ అధ్యక్షుడిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్సీపీ రాష్ట్ర యువత వైస్ ప్రెసిడెంట్గా పని చేసిన అభయ్ తాత, తండ్రి, మామ కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసినవారే కావడం విశేషం. జరుగుతున్న ఈ పరిణామాలు ఆ పార్టీకి ఇతర రాష్ట్రాల్లోనూ ఎంతోకొంత ఊపు తెచ్చేవిగానే ఉన్నాయని భావించాలి.