గతంలో ఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత ప్రజల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీపై ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకత కలిసివచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనతా పార్టీ ఓ విఫల ప్రయోగంగా మాత్రమే మిగిలింది. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల పేరుతో విపక్షాలు ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాల ఆయుర్దాయమూ స్వల్పకాలమే. మిగిలిన కాలమంతా ఏకఛత్రాధిపత్యంగా అధికారంలో ఉన్న ఘనత కాంగ్రెస్ పార్టీదే. దేశం నలుచెరగులా క్షేత్రస్థాయి వరకు బలంగా వేళ్లూనుకున్న ఆ పార్టీకి నిజమైన సవాల్ పాతికేళ్ల క్రితం అటల్ బిహారీ వాజ్పేయి, లాల్కృష్ణ అద్వానీల నేతృత్వంలోని బీజేపీ రూపంలో ఎదురైంది. పూర్తికాలం అధికారంలో ఉన్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా వాజ్పేయి చరిత్ర పుటలకెక్కారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా ఉన్నబలానికి తోడు తొలిసారిగా ఇతర రాజకీయ పక్షాలతో పొత్తులు పెట్టుకుని 2004 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించింది. ఆతర్వాత వరుసగా 2009 ఎన్నికల్లోనూ గెలిచి బీజేపీని ప్రతిపక్ష స్థానానికే పరిమితం చేసింది. అయితే 2014 నాటికి బీజేపీ నుంచి నరేంద్రమోదీ రూపంలో కాంగ్రెస్ పార్టీకి పెను సవాల్ ఎదురైంది. ఈసారి నరేంద్రమోదీ, అమిత్షాల రాజకీయ వ్యూహాలను ఎదుర్కోలేక అధికారం కోల్పోవడం మాత్రమే కాదు.. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి నిలుపుకునేందుకు పోరాడాల్సిన స్థితికి చేరింది. వచ్చే ఏడాదికి నరేంద్రమోదీ రెండోసారి ప్రధానిగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారు. 2024 ఎన్నికల్లోనూ గెలుపు బీజేపీదేనని పలు సర్వేలు చెపుతున్నాయి. ప్రతిపక్షాల్లో ప్రస్తుతానికి ఆయనకు దీటైన నాయకుడెవరూ కనిపించడం లేదనే చెప్పాలి. అంటే మూడోసారి మోదీ ప్రధాని కాకుండా నిలువరించడం విపక్షాలకు శక్తికి మించిన పనే.
ఉత్తరాది పార్టీ ముద్రను వదిలించుకోవాలి
కాంగ్రెస్ పార్టీ తరపున ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సుదీర్ఘ కాలం ప్రధాని బాధ్యతలు వహించినా ఆ పార్టీకి ఎన్నడూ మతం లేదా ప్రాంతాల ముద్ర పడలేదు. దానికి కారణం దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఆ పార్టీకి జాతీయ స్థాయిలో గౌరవం పొందిన నాయకులు పలువురు ఉండేవారు. పట్టాభిసీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, ఎన్జీ రంగా, పీవీ నరసింహారావు వంటి దిగ్గజ నాయకులు ఏపీనుంచి, సి. రాజగోపాలాచారి, కామరాజ్నాడార్ వంటి గొప్పనాయకులు తమిళనాడు నుంచి, నిజలింగప్ప లాంటి నాయకులు కర్ణాటక నుంచి ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన కారణం గానే ఆ పార్టీ దక్షిణాదిన సైతం బలమైన పునాదులు ఏర్పరచుకోగలిగింది.
వెంకయ్యనాయుడు స్థాయి నాయకులేరీ..?
ఇక బీజేపీకి నిన్నమొన్నటిదాకా దక్షిణాదినుంచి జాతీయ స్థాయిలో చెప్పుకోదగిన నాయకుడిగా వెంకయ్యనాయుడిని పేర్కొనాలి. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. నిజానికి వాజ్పేయి హయాంలోనూ ఆ తర్వాత మోదీ తొలిసారి ప్రధాని అయిన సమయంలోనూ వెంకయ్యనాయుడు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన ఉప రాష్ట్రపతి పదవిని అధిష్ఠించడం, పదవీ కాలం పూర్తి చేసుకోవడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడాయన రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. వెంకయ్య తరువాత దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన స్థాయి నాయకుడెవరా అని చూస్తే నిస్సందేహంగా మరొకరెవరూ కనిపించడం లేదని చెప్పాలి.
దక్షిణాదిన వ్యూహం మారాల్సిందే
దక్షిణాది రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు బీజేపీ తీవ్రస్థాయిలో ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీ వ్యూహాలు ఏమైనా కావచ్చుగానీ ఆ స్థాయిలో ఇక్కడ బలమైన నాయకత్వం నిర్మించుకోగలిగిందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కేవలం హిందుత్వ అజెండాతో తమ జెండా ఎగురవేయడం ఉత్తరాదిన సాధ్యం కావచ్చుగానీ దక్షిణాది రాష్ట్రాల్లో అది సాధ్యం కాదని ఆ పార్టీ గుర్తించాలన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది బీజేపీకి కూడా అర్థమైన కారణంగానే సోషల్ ఇంజనీరింగ్ వ్యూహంతో కొన్నిబలమైన కులాలను ఆకట్టుకునే ప్రయత్నం కూడా ఆ పార్టీ చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఆ ప్రయత్నం కూడా పెద్దగా ఫలించినట్టు కనిపించడం లేదు. బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకే ప్రాధాన్యమిస్తోందనే అభిప్రాయం దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక శాతం జనంలో నెలకొంది. ఈ అంశాన్నే జనంలోకి బలంగా తీసుకువెళుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీ దక్షిణాదికి విస్తరించకుండా వ్యూహాలు రచిస్తున్నారు.
ఏపీ సమస్యలపై చిన్నచూపు..?
ఇకరాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పలు సమస్యలు ఎదుర్కొంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్కే పరిమితమై ఏపీ కేవలం వ్యవసాయాధారితంగా మిగిలింది. ఈ రాష్ట్రానికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం, పెరుగుతున్న అంచనా వ్యయం ఇందుకు కారణం. దీనికి అవసరమైన నిధులు సొంతంగా సమకూర్చుకోగల ఆర్థిక స్థోమత ఇప్పుడు ఏపీకి లేదు. ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యాలా చూడటంలో కేంద్రానిదే ప్రధాన బాధ్యత. అయితే పనులు నత్తనడకన సాగడంపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనికితోడు రాజధాని అమరావతి నిర్మాణం నిలిచిపోవడం, రాష్ట్రానికి ఇప్పటికీ రాజధానిపై స్థిరత్వం లేకపోవడంపై సామాన్య ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైనా పడుతోంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తున్న అంశాలివి. ఈ పరిస్థితులు మార్చాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉంది. అందుకు ప్రజల్లో విశ్వసనీయత ఉన్న నాయకులు కావాలి. రాష్ట్ర సమస్యలపై కేంద్రంలోని సొంత పార్టీ ప్రభుత్వంపై పోరాడి న్యాయం చేయగలరన్న నమ్మకం కలిగించాలి. ఇతర పార్టీల నుంచి రెడీమేడ్గా దిగుమతి చేసుకునే నాయకులు బీజేపీకి సిద్ధాంతాలతో ఇమడటం కష్టమే. కేవలం తమ సొంత ప్రయోజనాలకోసమే పార్టీలోకి వచ్చిన వారు బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం మాత్రమే ఆ పార్టీ నీడన ఉంటారు. ప్రజల్లోంచి పుట్టే నాయకులే ఏపార్టీకైనా బలమైన పునాదిగా మారతారు. అంటే స్థానికంగా ప్రజలకు ఆ పార్టీపై అభిమానం పెరగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాలను చేసి చూపాలి. చేస్తున్నవాటినివివరించాలి. భవిష్యత్తులో చేయబోయేవి ప్రకటించాలి. శుష్క వాగ్దానాలుగా మిగిలిపోకుండా అవి కార్యరూపం దాల్చి ప్రజలకు కనిపించాలి. వారిలో విశ్వాసం నింపాలి. అప్పుడే ఇక్కడ ఆ పార్టీ అద్భుతాలు ఆశించగలిగేది.