మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. మోదీ షా ద్వయం ఆధ్వర్యంలోని బీజేపీ వ్యూహాలు ప్రత్యర్థుల ఊహకందని స్థాయిలో ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పరిస్థితులను బట్టి ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి వారిని తనవైపునకు తిప్పుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాణక్యాన్ని కూడా ఎవరూ తక్కువగా అంచనా వేయలేరు. అందుకే బీజేపీ టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు పక్కా వ్యూహాన్ని రచించి ముందుకు వెళుతున్నట్టు ఆ పార్టీ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
మునుగోడులో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్షా పాల్గొన్న సభలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి పలువురు నాయకులు బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ అవినీతి పాలనను అంతం చేయడమే లక్ష్యమని ప్రకటించిన అమిత్షా కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఢిల్లీకి సంబంధించిన మద్యం స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందంటూ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్సింగ్, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీలో ఆరోపించడం సంచలనం సృష్టిస్తోంది. కేసీఆర్ను కట్టడి చేసేందుకు బీజేపీ పలు ఆయుధాలను సిద్ధం చేసుకున్నట్టు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి.
రామోజీరావు, ఎన్టీఆర్తో అమిత్షా సమావేశం..
మీడియా మొఘల్గా పేరున్న రామోజీరావుతోను, నందమూరి కుటుంబం నుంచి టాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగుతున్నతారక్ తోను హోం మంత్రి అమిత్షా ఆదివారం రాత్రి సమావేశం కానుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి రామోజీకి బీజేపీ పెద్దలతో మొదటినుంచి సత్సంబంధాలే ఉన్నాయి. మోదీ హయాంలోనే ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో ప్రభుత్వం గౌరవించింది. మోదీ ప్రధాని అయ్యాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ వంటి పథకాలకు ఈనాడు గ్రూపునకు చెందిన మీడియా విశేష ప్రచారం కల్పించింది. ఏపీ సీఎం కాకముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రామోజీ వద్దకు వెళ్లి ఆయన మద్దతును కోరారు. ఈనాడు కూడా అప్పట్లో వైఎస్ జగన్ పాదయాత్రకు వార్తల్లో ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం కల్పించింది. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఈనాడు సహా ఇతర మీడియా సంస్థలపై వైసీపీ నేతలు పదేపదే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో రామోజీరావుతో అమిత్షాతో సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా నోవోటెల్ హోటల్లో సమావేశం కానుండటంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రం చూశాక తారక్ నటనకు అమిత్షా ఫిదా అయిపోయారని అందుకే అతడిని అభినందించేందుకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారని బీజేపీ నాయకులు చెపుతున్నారు. అయితే అంతకుమించిన రాజకీయ వ్యూహం దీనివెనుక ఉందని, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న తారక్ను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటోందని విశ్లేషకులు చెపుతున్నారు. నిజానికి ఎన్టీఆర్ తాను ఎప్పటికీ టీడీపీ మద్దతుదారుగానే ఉంటానని గతంలో పలుసార్లు ప్రకటించినా ప్రస్తుతం ఆయన సినిమాలకు మాత్రమే పరిమితమై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
దక్షిణాదిన బలపడేందుకు సినీ గ్లామర్ ..?
ఉత్తరాదిన ఇప్పటికే హిందుత్వ నినాదంతో తిరుగులేని విధంగా బలపడిన బీజేపీ.. ఇప్పడు దక్షిణాదిన బలపడేందుకు సినీ గ్లామర్ను కూడా వాడుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో రజనీకాంత్, తెలుగునాట చిరంజీవి, ప్రభాస్, తారక్, కర్ణాటకలో యష్ వంటి ప్రముఖ నటులకున్న ప్రజాదరణను తనకనుకూలంగా వినియోగించుకునే వ్యూహంలో బీజేపీ ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే వీరిలో అధిక శాతం రాజకీయాల్లోకి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపని నేపథ్యంలో బీజేపీ వీరిని ఎంతవరకు ఒప్పించగలదో చూడాల్సి ఉంది.