” ఇంటి నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్న ఆఫీస్ కి వెళ్లాలంటేనే బైక్ లేదా కార్ ఉండాలి. అలాంటిది ఏకంగా వెయ్యి కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లారంటే ..?
పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ముగ్గురు కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక, వెయ్యి కిలోమీటర్లు కాలినడకన ఒడిశాలోని కొరాపుట్కు చేరుకున్న హృదయ విదారక సంఘటన ఇది. ఒడిశాలోని కలహండి జిల్లా తింగల్కన్ గ్రామానికి చెందిన బుడు మాజీ, ఖతర్ మాజీ, బికారీ మాజీ ఒక మధ్యవర్తి ద్వారా బెంగళూరులోని ఒక సంస్థలో పనికి కుదిరారు. పని చేయించుకోవడమే తప్ప జీతం అడిగితే చాలు ఆ సంస్థ యజమానులు వీరిని కొట్టేవారు. రెండు నెలలు పనిచేసిన తర్వాత జీతం కోసం నిలదీసిన వీరిని యాజమాన్యం చావగొట్టి బయటకు గెంటేసింది. చేతిలో రూపాయి కూడా లేదు. దీంతో ఈ ముగ్గురూ కేవలం మంచినీళ్ల సీసాలు మాత్రమే పట్టుకుని వెయ్యి కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి కాలినడకన బయలుదేరారు. వీరి దయనీయ గాథ విన్న పలువురు దారిలో వీరికి సహాయం చేసేవారు. కొందరేమో భోజనం పెట్టించగా, మరికొందరు కొంత దూరం పాటు రవాణా సౌకర్యం కల్పించేవారు. అలా నానా కష్టాలు పడి వారం రోజుల తర్వాత ఒడిశాలోని కోరాపుట్కు చేరుకున్నారు. అప్పటికే వీరి ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారింది. వీరిని చూసిన కొందరు స్థానికులు భోజనం పెట్టి, కొంత సొమ్ము ఇచ్చి వారి స్వగ్రామాలకు పంపి వారి స్థాయిలో ఔదార్యం చాటుకున్నారు.