‘అగ్నిపథ్’ పేరుతో కొత్త సర్వీస్ స్కీంను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ పధకం ద్వారా నాలుగేళ్ల కాలపరిమితితో సైన్యంలో నియమిస్తారు. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత మూడున్నరేళ్లు నుంచి నాలుగేళ్లు సర్వీస్ లో కొనసాగిస్తారు. వీరికి రూ.30-40 వేల వేతనం ఉంటుంది. సర్వీస్ పూర్తయ్యాక 25 శాతం మందిని శాశ్వత కమిషన్ లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారు. 75 శాతం మందికి రిటైర్మెంట్ ఇస్తారు. వీరికి వన్ టైమ్ బెనిఫిట్ అందిస్తారు. ఇలా చేయడం వల్ల రక్షణ శాఖపై భారీ ఆర్ధిక భారం తప్పనుంది. అంతే కాకుండా సైన్యంలో పనిచేయాలని కలలు కనే యువతలో ఎక్కువమందికి సేవ చేసే అవకాశం కూడా దక్కుతుంది.
తొలి దశలో 45వేల మంది ఈ సర్వీసులో చేర్చుకోవాలని రక్షణ శాఖ భావిస్తోంది. అగ్నీపథ్ లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాన్ని ఇస్తారు. నాలుగేళ్ల సర్వీస్ అనంతరం అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ తో పాటు పదవీ విరమణ తర్వాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో అమలు చేస్తారు. రిటైర్మెంట్ తర్వాత వీరికి ఎలాంటి పింఛన్ సదుపాయం ఉండదు. దీని ద్వారా రక్షణ శాఖకు కొంత మేర ఆర్థిక భారం తగ్గించినట్లవుతుంది.