జాతీయ పార్కులు, వైల్డ్లైఫ్ శాంక్చుయరీల పరిధిలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రక్షిత అడవులకు ఒక కిలోమీటర్ పరిధిని ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్జెడ్)గా ప్రకటించాలని, ఆ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని జస్టిస్ ఎల్ నాగేశ్వర్రావు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈఎస్జెడ్ పరిధిలో ఇప్పటికే ఉన్న నిర్మాణాల జాబితాలు తయారుచేసి మూడు నెలల్లోగా కోర్టుకు సమర్పించాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ కన్జర్వేటర్లకు సూచించింది. జాబితా రూపకల్పనకు డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలను ఉపయోగించాలని, ఇందుకోసం ప్రభుత్వాల సహాయం తీసుకోవాలని ఆదేశించింది. అటవీ సంరక్షణకు సంబంధించి టీఎస్ గొడవర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతున్న మైనింగ్ వ్యవహారాలపై ఏమి చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.