అందరూ ఊహించనట్టుగానే భారీ మెజారిటీతో భారత 15వ రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె ఘనవిజయం సాధించారు. మొత్తం నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగ్గా, మూడు రౌండ్లు ముగిసేసరికే రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన మ్యాజిక్ నెంబర్ ఓట్లను ఆమె సాధించారు. రాష్ట్రపతి అయ్యేందుకు కావాల్సిన ఓట్ల విలువ 5,28,491 కాగా ద్రౌపది ముర్ముకు తొలి ప్రాధాన్యతా ఓట్లు 2824 వచ్చాయి. వీటి విలువ 6,76,803. మరోవైపు విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) కు 1877 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 3,80,177. ద్రౌపది ముర్ముకు వచ్చిన తొలి ప్రాధాన్యతా ఓట్లను బట్టి ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ మీడియాకు వెల్లడించారు. తద్వారా దేశంలో అత్యున్నత పీఠాన్ని కైవసం చేసుకున్న తొలి ఆదివాసీ మహిళగా ఆమె కొత్త చరిత్రను సృష్టించారు.
నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం దేశ ప్రజాస్వామ్యానికి శుభసూచకం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో ముర్ము తాత్కాలిక నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. ఇక నూతన రాష్ట్రపతిగా తమ ఊరిబిడ్డ ఎన్నికైన సందర్భంగా ద్రౌపదిముర్ము స్వగ్రామం ఒడిశా రాష్ట్రంలోని రాయ్రంగపూర్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.