నోట్ల రద్దు చర్యను అయిదుగురు సభ్యుల ధర్మాసనం 4-1 తేడాతో సమర్థించింది. ఆ పిటిషన్లను సుప్రీం కొట్టిపారేసింది.కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం వెయ్యి, 500 నోట్లను రద్దు చేసింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యలు ధర్మాసనం నోట్ల రద్దును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్న, వీ సుబ్రమణియన్, బీవీ నగరత్న ఉన్నారు. అయితే ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న మాత్రం నోట్ల రద్దు అంశాన్ని తప్పుపట్టారు.
మెజారిటీ న్యామూర్తుల అభిప్రాయాన్ని జస్టిస్ గవాయి వినిపించారు. ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే సమయంలో.. చాలా సంయమనం అవసరమని ఆయన అన్నారు. న్యాయ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థ అభిప్రాయాలు ముడిపెట్టలేమన్నారు. నోట్ల రద్దు అంశంపై కేంద్రం, ఆర్బీఐ మధ్య ఆరు నెలల పాటు సంప్రదింపుల ప్రక్రియ సాగిందన్నారు. నోట్ల రద్దు ప్రక్రియను చేపట్టే వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్బీఐకి లేదని జస్టిస్ గవాయి తెలిపారు.
నోట్ల రద్దు గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నొటిఫికేషన్ చట్టవ్యతిరేకమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న తెలిపారు. నోట్ల రద్దు అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఆ చర్య చట్టవ్యతిరేకంగా సాగినట్లు ఆమె తెలిపారు. నోట్ల రద్దు చర్య కేంద్రం చేపట్టాల్సింది కాదు అని ఆమె అన్నారు. 2016, నవంబర్ 8న, కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, పిటిషన్లు దాఖలు చేసినవారితో ఏకీభవిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆర్బీఐలోని సెక్షన్ 26 ప్రకారం.. ఆ సంస్థ నోట్ల రద్దు సిఫారసు చేసి ఉండాల్సిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు డిమానిటైజేషన్ చేయడం సరికాదు అని ఆమె అన్నారు. నా అభిప్రాయంలో నవంబర్ 8 నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, కానీ 2016 నాటి సంఘటనపై ఇప్పుడు నిలుపుదల చేయలేమని తెలిపారు. నోట్ల రద్దు అంశం చట్టం పరిధిలో జరగలేదని, అది అధికారంతో జరగిందని, అందుకే దాన్ని చట్టవ్యతిరేక నిర్ణయమని అభిప్రాయపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసిన తీరు చట్టం ప్రకారం సాగలేదన్నారు. ఆర్బీఐ బోర్డు ఇచ్చే ప్రతిపాదన మేరకు నోట్ల రద్దు అమలు సాగాలని, కానీ నోట్ల రద్దు చేపట్టాలని కేంద్రం నవంబర్ 7వ తేదీన ఆర్బీఐ బోర్డుకు లేఖ రాసిందని, ఇది సరైన విధానం కాదు అని జస్టిస్ నాగరత్న తెలిపారు. పార్లమెంట్ ద్వారా నోట్ల రద్దు ప్రక్రియను చేపడితే బాగుండేదని, కానీ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ సరిగా లేదన్నారు. కేంద్ర ప్రోద్భలతంతోనే ఆ చర్య చేపట్టారని, కానీ ఆర్బీఐ వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా జరిగినట్లు లేదన్నారు.