- పుష్కర కలం దాటినా ట్రయల్ జరగకపోవటమా?
- గనుల అక్రమ తవ్వకాల కేసు విచారణపై సుప్రీం తీవ్ర అసహనం
గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసి ;పన్నెండేళ్లు గడిచినా కేసు విచారణ జరగకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయటమేనని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం వ్యాఖ్యానించింది. గాలి జనార్దన్రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ వివరాలు అందించాలని, విచారణ ఏ దశలో ఉన్నది? ఏ కారణాలతో ఆలస్యం అవుతున్నది? తదితర వివరాలపై నివేదికను ఈ నెల 19లోపు సీల్డ్ కవర్లో అందజేయాలని హైదరాబాద్ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిని ఆదేశించింది. తీవ్రమైన అభియోగాలున్న ఈ కేసులో 12 ఏండ్ల తర్వాత కూడా విచారణ జరగకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నది. తనకు 2015 జనవరిలో మంజూరు చేసిన బెయిల్ షరతులను సడలించాలని గాలి జనార్దన్రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గాలి జనార్దన్రెడ్డి పిటిషన్ను తిరస్కరించాలని, బెయిల్ షరతులు సడలిస్తే విచారణ పురోగతిపై ప్రభావం పడుతుందని, సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా వాదించారు. దీంతో కేసు విచారణ పురోగతి వివరాలు తెలిశాక నిర్ణయం తీసుకొంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేసింది.