‘ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై కేంద్రం విధించిన నిషేధం శుక్రవారం (జులై 1) నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. అయితే ఈ నిషేధాన్ని క్షేత్ర స్థాయిలో అమలుచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది. మనకెందుకులే.. అన్న ఉదాసీనతే మనకు పర్యావరణ విద్వంసాన్ని తెచ్చిపెడుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రభుత్వాల పని అనుకోకూడదు. మన వంతు ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించుకోవడం, ముందు మన కుటుంబ సబ్యులకు చెప్పడం, తోటి వారికీ అవగాహన కల్పించడం.. మన బాధ్యత.
దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారాన్ని ప్రారంభిస్తాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, పంపిణీ, నిల్వ, అమ్మకాలు చేసే యూనిట్లు మూసివేయిస్తాయని పేర్కొన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే పర్యావరణ పరిరక్షణ చట్టం(ఈపీఏ)లోని సెక్షన్ 15, సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనల కింద జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటవుతాయి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్(ఎస్యూపీ) వస్తువుల తయారీ, పంపిణీ, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు పనిచేసేలా యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంది. ఈ నిషేధం అమలులో సహకరించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) పౌరులకు కూడా అవకాశం కల్పించింది. ఓ గ్రీవెన్స్ రిడ్రెసల్ అప్లికేషన్ను లాంచ్ చేసింది.
నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్ వస్తువులు ఇవే..
ఇయర్బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు (క్యాండీ స్టిక్స్), ఐస్క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్ షీట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్లు, ప్లాస్టిక్ కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్కు వాడే పల్చటి రేపర్స్, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు.