హిమాలయాల్లోని అమర్నాథ్ లో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో శ్రమకోర్చి చేసే యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఈ యాత్ర జరిగే ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో భక్తుల గుడారాలు కొట్టుకుపోయాయి. వాటిలో ఉన్న పలువురు భక్తులు గల్లంతయ్యారు. వీరిలో 15 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా పదుల సంఖ్యలో యాత్రికుల ఆచూకీ తెలియడం లేదని వార్తలు వస్తున్నాయి. భక్తులను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాయి.
భక్తులను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమర్నాథ్ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్టు సమాచారం. కాగా అమర్నాథ్ యాత్రలో వరదల కారణంగా పలువురు యాత్రికులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హాతో మాట్లాడి సహాయక చర్యల వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు కేంద్రం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ప్రధాని ప్రకటించారు.