” మహారాష్ట్ర కొత్త కేబినెట్ లో మంత్రి పదవి ఇప్పిస్తాం. వంద కోట్లు ఇవ్వండి..” అంటూ ఓ ఎమ్మెల్యే ను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు..”
రూ . 100 కోట్లు చెల్లిస్తే మహారాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం శాఖల కేటాయింపులో మార్పు చేర్పులు చేపట్టనుందనే ఊహాగానాల నేపధ్యంలో ఈ ఘటన వెలుగుచూసింది. దౌండ్ బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ కుల్ ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. జులై 12న రియాజ్ షేక్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఓ ఆఫర్పై చర్చించేందుకు మిమ్మల్ని కలవాలని రియాజ్ కోరాడని ఎమ్మెల్యే రాహుల్ కుల్ తెలిపారు. ముంబైలోని హోటల్లో కలిసిన రియాజ్ తనకు మంత్రి పదవిని ఆఫర్ చేశాడని, ఓ సీనియర్ రాజకీయ నేత ఈ పని చేస్తాడని అందుకు ఆయనకు రూ 100 కోట్లు చెల్లించాలని చెప్పాడని తెలిపారు. 20 శాతం డబ్బును అడ్వాన్స్గా చెల్లించాలని రియాజ్ డిమాండ్ చేశాడని చెప్పారు. అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్ధమని మనం తర్వాత కలుద్దామని చెప్పానని రాహుల్ కుల్ తెలిపారు.
ఈలోగా రియాజ్ వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లిన రాహుల్ ఆపై మెరైన్ డ్రైవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫనసల్కర్ ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు. ఇక ఎమ్మెల్యే నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు హోటల్కు రావాలంటూ నిందితులపై వలపన్నిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులను రియాజ్ షేక్, యోగేష్ కులకర్ణి, సాగర్ సంఘ్వి, జాఫర్ ఉస్మానిగా గుర్తించారు. నిందితుల నుంచి పోలీసులు మూడు మొబైల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు.