శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్సీటీసీ కొత్తగా భారత్ గౌరవ్ రైలును అందుబాటులోకి తెచ్చింది. పుణ్యక్షేత్రాలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారత్ గౌరవ్ టూరిస్టు ట్రైన్కు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో తాజాగా సికింద్రాబాద్ నుండి శబరిమల యాత్రకు కూడా ప్రత్యేక ట్రైన్ను ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుండి 20వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ యాత్రకు సంబంధించి బ్రోచర్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు.
ఈ రైలు శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం, ఎర్నాకుళం చొటానిక్కర్ అమ్మవారి ఆలయాలను కవర్ చేస్తుంది. ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్న ఈ ట్రైన్ లో సికింద్రాబాద్, నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు. రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్ స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కేందుకు అవకాశం కల్పించారు.
నవంబర్ 16న ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక ట్రైన్ సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7 గంటలకు కేరళలోని చెంగనూరుకు చేరుకుంటుంది. అక్కడ దిగి రోడ్డు మార్గంలో నీలక్కళ్కు తీసుకెళ్తారు. అక్కడి నుండి సొంతంగానే కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. మూడో రోజు దర్శనం, అభిషేకం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నీలక్కళ్ నుండి చోటానిక్కర (ఎర్నాకులం) వచ్చి రాత్రి బస చేస్తారు. నాలుగో రోజు ఉదయం 7 గంటలకు చోటానిక్కర్ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని .. రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ఎర్నాకులం టౌన్లో మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఐదో రోజు రాత్రి 9.45 గంటలకు తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ప్యాకేజికి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్ను సందర్శించాలి.