Cyclone Dana: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. నేటి రాత్రి తీరం దాటనున్న ‘దానా’

 

బంగాళాఖాతంలో ఏప్పడిన దానా తుపాను మరింత ఉధృతంగా మారింది. ఈ  అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

అయితీ తుపాను ప్రభావంతో ఏపీలో రానున్మూన డు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.   తుపాను  నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. తీరం వెంబడి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గత రాత్రి 8 గంటల నుంచి నేటి ఉదయం 10 గంటల మధ్య ఈస్ట్రన్ సీల్దా డివిజన్‌లో 190 రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోనూ 14 రైళ్లు రద్దయ్యాయి.