టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడటం ఏమిటి..? అనుకుంటున్నారు కదూ..! కానీ ఇది నిజమే. అయితే ఇదంతా ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసింది. ఎందుకంటే ఆ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే మరి.
విభిన్నచిత్రాల్లో నటిస్తూ తక్కువ కాలంలోనే మంచిపేరు తెచ్చుకున్న హీరో అడివిశేష్. అతడు నటించిన తాజా చిత్రం ‘మేజర్’ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాయి. 2008 నవంబర్ 26న ముంబయిలో విరుచుకుపడిన తీవ్రవాదులను మట్టుపెట్టేందుకు వారితో వీరోచితంగా పోరాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో అంచనాలుండటం విశేషం.
ప్రస్తుతం ‘మేజర్’ టీమ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పలు ఏరియాల్లో హీరో అడివి శేష్తో కలిసి చిత్రయూనిట్ వినూత్నమైన పద్ధతుల్లో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా సడెన్గా మహేష్ కూడా వారితో జత కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మహేష్ పాల్గొన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారిగా ముందుగా సినిమా విడుదల చేశాక ఆ తరువాత దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనుండటం ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషం.