- ఓ కిడ్నీ కూడా ఫెయిలైందని వెల్లడి
- శస్త్రచికిత్సల అనంతరం హ్యాపీగా ఉన్నానని వివరణ టాలీవుడ్ లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి. రానా సినీ వారసత్వంతో వచ్చినా ఆ ఆనవాళ్లు తన సినిమాలపై పడకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకున్నాడు. తాజాగా ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో బాబాయి వెంకటేశ్ తో కలిసి నటించాడు. ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో రానా ఆసక్తికర అంశాలు వెల్లడించాడు.
తనకు కుడి కన్ను కనిపించదని, ఆ కంటికి శస్త్రచికిత్స జరిగిందని తెలిపాడు. అంతేకాదు, ఓ కిడ్నీ విఫలం కావడంతో, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా జరిగిందని వివరించాడు. ఆ లెక్కన తాను ఒక టెర్మినేటర్ అని అంటూ చమత్కరించాడు.
ఓసారి ఒక పిల్లవాడు ఓ కన్ను కనిపించడంలేదని తల్లితో చెప్పి ఏడుస్తున్నాడని, దాంతో, నాకు కూడా ఒక కన్ను కనిపించదని చెప్పి ఆ చిన్నారిని ఊరడించానని రానా గుర్తుచేసుకున్నాడు.
శారీరక సమస్యలకు సంబంధించి నయం అయినప్పటికీ, తనకు ఎందుకిలా జరుగుతోందని ప్రతి మనిషి ఆలోచించడం సహజమని, కానీ అలాంటి వాటిని పట్టించుకోనవసరంలేదని రానా అభిప్రాయపడ్డాడు. తాను ఇప్పుడు ఆనందంగా ఉన్నానని వెల్లడించాడు. రానా కూడా తన బాబాయ్ వెంకటేష్ వలె ఆత్మావలోకనం చేసుకుంటారంటూ కామెంట్స్ వస్తూ ఉంటాయి.