టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాస్త గ్యాప్ తీసుకున్న చిత్ర బృందం ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘పుష్ఫ ది రూల్’ చిత్రీకరణకు సిద్ధమైంది. సోమవారం దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిజానికి మొదటి భాగం గత ఏడాది చివరిలో భారీ అంచనాల మధ్య రిలీజైనా తెలుగులో ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయిందనే చెప్పాలి. అయితే బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రం విశేషంగా ఆకట్టుకుని అక్కడ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు తోడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విలక్షణ నటనకు సినీ అభిమానులంతా ఫిదా అయిపోయారు. ఈ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు.
దీంతో సీక్వెల్ విషయంలో దర్శకుడు సుకుమార్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. స్క్రిప్టును మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంతో పాటు, మూవీని మరింత గ్రాండియర్గా రూపొందించే ప్రయత్నంలో భాగంగానే కాస్త గ్యాప్ తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి బడ్జెట్ కూడా మరింత పెరగనుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సీక్వెల్ కోసం దేవీశ్రీప్రసాద్ మొదటి భాగాన్ని మించిన బాణీలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేందుకు శ్రమిస్తున్నాడు. 2023 దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.