” ఓ సినిమా కోసం 22 రోజులు కాల్షీట్లు ఇచ్చాను. ఆ సినిమాకు నేను తీసుకునే డబ్బు రోజుకు రెండు కోట్లు. ఇరవై రెండు రోజులు పని చేస్తే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను.” అంటూ జనసేన 10వ ఆవిర్భావ సభ సందర్బంగా పవన్ కల్యాణ్ చేసిన రెమ్యునరేషన్ ఇష్యూ ఇపుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు. పవన్ సినిమా రిలీజవుతుందంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. భారీ కటౌట్లతో ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇక ఆయన క్రేజ్కు తగ్గట్టే నిర్మాతలు పవన్కు ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇవ్వడానికి సిద్ధం. పవన్.. సినిమా ఒప్పుకుంటే చాలు బ్లాంక్ చెక్ మీద సైన్ చేసిచ్చే నిర్మాతలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ”. ఈ రోజు ధైర్యంగా చెబుతున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాకు 22 రోజులు కాల్షీట్లు ఇచ్చాను. ఆ సినిమాకు నేను తీసుకునే డబ్బు రోజుకు రెండు కోట్లు. ఇరవై రోజులు పని చేస్తే దాదాపు 45 కోట్లు తీసుకుంటాను. ప్రతి సినిమాకు అంత డబ్బు ఇస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి. నాకు డబ్బులు అవసరం ఏముంది? నేను సంపాదించుకోలేని డబ్బులా?” అని పవన్ జనసేన సభలో చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ చేస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా గతకొన్ని రోజులుగా ఈ సినిమాకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా పవన్ తన పారితోషికం గురించి స్వయంగా చెప్పడంతో ఇండస్ట్రీలో హాట్టాపిక్ అయింది. పీపుల్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. పవన్ రెమ్యునరేషన్ బయట పెట్టినప్పటి నుంచీ వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది. ‘అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న పవన్ ఆదాయ పన్ను ఎగ్గొట్టకుండా కడుతున్నాడా? ” అంటూ రచ్చ చేస్తున్నారు. పవన్ ఇంత తీసుకుంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు తీసుకునే రెమ్యునరేశన్ పైనా చర్చ నడుస్తోంది.