సీనియర్ నటుడు నరేష్.. నటి పవిత్రాలోకేష్లు రిలేషన్ షిప్లో ఉన్నారని త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని కొంతకాలంగా అటు కన్నడ మీడియాలోనూ ఇటు తెలుగు మీడియాలోనూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నరేష్తో తన వైవాహిక బంధం ఇంకా తెగిపోలేదని, విడాకుల పత్రంపై తాను సంతకం చేయనందున తాను అతడి భార్యనేనని చెప్పుకోవడంలో తప్పు లేదని చెప్పడంతో వ్యక్తిగత వివాదం మరోసారి రచ్చకెక్కింది. గతంలో ఆమె ఆర్థిక సంబంధమైన వివాదాల్లో చిక్కుకున్న సమయంలో ఆమెతో తాను కలిసి ఉండటం లేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన నరేష్ ఆ తర్వాత రమ్యకు డైవోర్స్ కోసం నోటీసు పంపించినట్టు తెలుస్తోంది.
ఇక రమ్య బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటంతోపాటు ఇటు హైదరాబాద్లోనూ మీడియాతో మాట్లాడే ప్రయత్నాల్లో ఉండటంతో నరేష్, పవిత్రాలోకేష్ కూడా తమ మధ్య రిలేషన్ విషయంపై తొలిసారిగా స్పందించారు. తాము మంచి స్నేహితులమని, ఒకరి కష్టసుఖాలు మరొకరికి తెలుపుకోవడంతో ఒకరికొకరం అండగా ఉంటున్నామని తెలిపారు. రమ్య బెంగళూరు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి తమ ప్రస్తావన తీసుకురావడం ఏమాత్రం సరికాదని, అది కేవలం ప్రచారం కోసమే చేసినట్టు అనిపిస్తోందని పవిత్ర అన్నారు.
ఇక తన భర్తగా చెప్పుకుంటూ తనపై విమర్శలు చేసిన కన్నడ దర్శకుడు సుఖేంద్రప్రసాద్ను తాను అసలు వివాహమే చేసుకోలేదని, కలిసి జీవించామని.. 2017లో విడిపోయామని పవిత్రాలోకేష్ వెల్లడించారు. నరేష్ ను జెంటిల్మేన్ గా అభివర్ణించిన పవిత్ర తాను ఆయనకు తోడుగా ఉంటున్నట్టు ఓపెన్ అయ్యారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవని, ఎవరి వ్యక్తిగత విషయాలు వారే చూసుకుంటున్నామని చెప్పారు. ఆ విషయంలో తమ ఇద్దరికీ క్లారిటీ ఉందని పవిత్ర అన్నారు. ఈ అంశంపై ఇటు రమ్య కూడా మీడియాకెక్కడంతో ఈ వివాదం మరింత రచ్చగా మారే అవకాశం కనిపిస్తోంది.