అవును.. ఇందులో అతిశయోక్తి ఏమీలేదు. ప్రశాంత్నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్ రాకీ పాత్రలో నటించిన ‘కేజీఎఫ్-2’ సినీ పండితుల అంచనాలకు సైతం అందని స్థాయిలో సంచలనాలకు వేదికగా మారింది. ఇప్పటికే బాలీవుడ్లో అత్యంత వేగంగా రూ. 200 కోట్లు వసూలు చేసిన చిత్రంగా కొత్త రికార్డును లిఖించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్లో చేరిపోయి సౌత్ ఇండియన్ సినిమాల సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పింది. ఈ మూవీ స్పీడ్ ఇంతటితో ఆగలేదు. ఆరు రోజులకు గాను రూ. 675 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కేజీఎఫ్-2.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రం ఆల్టైమ్ వసూళ్లను ఇప్పటికే అధిగమించింది. అప్పట్లో ‘బాహుబలి-1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్ల గ్రాస్ వసూలు చేసిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పటికీ తరగని ప్రేక్షకాదరణతో బాక్సాఫీసు వద్ద కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం ఇప్పుడు రూ. 1,000 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకునేందుకు ఉరకలు వేస్తోంది. ఈచిత్రం దూకుడు చూస్తుంటే అదేమంత దూరంలో లేదనిపిస్తోంది. వచ్చే వారం రోజుల లోగానే ‘కేజీఎఫ్-2’ ఈ అరుదైన ఘనతను సాధించిన నాలుగో చిత్రంగా నిలవడం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. అదే ఊపులో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులపైనా ఈ మూవీ కన్నేసింది. మేటి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా రూ. 1,100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ. వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన మూడో చిత్రంగా నిలిచింది. . దీనికంటే ముందున్న చిత్రాలు ‘బాహుబలి-2’.. రూ. 1,788 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలోను, అమీర్ఖాన్ కథానాయకుడిగా వచ్చిన ‘దంగల్’ చిత్రం చైనా సహా ప్రపంచవ్యాప్తంగా రూ.2,122 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలోను ఉన్నాయి. అయితే భారత్ లో వసూళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే రూ. 1,400 కోట్లకు పైగా గ్రాస్, రూ. 1,000 కోట్లకు పైగా షేర్తో బాహుబలి-2 దే అగ్రస్థానం. ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాల రికార్డులూ పదిలమేనని చెప్పాలి.